(అంశం:”బానిససంకెళ్లు”)
స్మశాన సమాజం?!
సుజాత.పి.వి.ఎల్
మనది నాగరిక సమాజమా?!
కాదు అరణ్యం..
కౄరమృగాలు విషసర్పాలు
మనుషులై సంచరిస్తున్న జనారణ్యం..
నమ్మకం అనేది అర్థం లేని పదమైపోయింది..
ఇప్పుడు
సాటి మనిషిని మనిషిగా గౌరవించడం
ఆత్మీయుడిగా ఆదరించడం అసాధ్యం అయిపోయింది..
స్వార్థం రాజై నిరంకుశ పాలన సాగిస్తోంది..
హింస మానవ ప్రవృత్తిగా మారిపోయింది..
ఉగ్రవాదంలో కూడా గ్లోబలైజేషన్ వచ్చేసింది..
తీవ్రవాదం ప్రపంచ దినచర్యలో భాగమైపోయింది..
పాలుగారే పసితనం
జాలి కలిగించే వృధ్ధాప్యం కూడా కరుడుగట్టిన
కర్కశులని కరిగించలేకపోతున్నాయి..
కసాయిలతోను, నెత్తురోడే కత్తులతోను
తెగిపడుతున్న కుత్తుకలతోను
నిండనున్న
రేపటి స్మశాన సమాజంలో
బానిస సంకెళ్ల నడుమ
రాబందులుగా మారి
బ్రతకాల్సిందే!!
****