నాన్నకు ప్రేమతో

అంశం: ప్రేమలేఖ

నాన్నకు ప్రేమతో
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ముంబై
14-02-22

నాన్నగారికి
నమస్కరిస్తు గాయత్రి వ్రాయునది. మేమంతా ఇక్కడ క్షేమముగా ఉన్నాము. మీరు అక్కడ ఎలా ఉన్నారు. వేళకు భోజనం చేస్తున్నారా. మందులు వేసుకుంటున్నారా. వంటత్తయ్య వస్తున్నాదా.. మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మీరు నీరసంగా ఉన్నారు. అమ్మపోయి మూడేండ్లు అయిపోయింది. మీకు ఎనిమిది పదులవయస్సు దాటింది. నాన్నా మీరు ఈ వయస్సులో మాదగ్గర ఉండడం భావ్యం. అన్యధా భావించకండి. మీరే అమ్మతో కూడా అనేవారు అబ్బాయి ఆయిన అమ్మాయి అయినా మనకు గాయత్రీయే పిచ్చిమొద్దు ఈ రోజుల్లో అమ్మాయిలే నయం అని జ్ఞాపకం ఉందా నాన్నా.
మీ మనుమలు కవలలిద్దరికి మీరు అమ్మ కలిపి రామలక్ష్మణులని పేరు పెట్టి పెద్ద చదువులు చదువుతారని ఇరవై ఏళ్ళ క్రిందట దీవించేరు. మీ దీవెనల ఫలితమే వారిరువుకి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గా క్యాంపస్ లోనే సెలెక్ట్ అయ్యారు. చిన్నప్పుడు తిరుపతి వెంకన్న కనిపించడని పది సంవత్సరాల నన్ను భుజం మీద కూర్చోపెట్టుకుని చూపించడం మరువలేనిది. అప్పుడు అమ్మ అది చిన్నపిల్లకాదు నవ్వుతారు అంటే నాకెప్పుడు  అది చిన్నపిల్లే అన్నది ఇప్పటికీ జ్ఞాపకమే. నా కొడుకులు తాతయ్య , నువ్వు స్నేహితులులా కబుర్లు చెప్పుకోవడం మాకు నచ్చిందమ్మా అంటే నాకెంతో గర్వం. నా జీవితంలో మొదటి హీరో మీరే నాన్నా. దేముడి భుజలపై ఎక్కి గర్భగుడిలో దేముడిని చూసాను అనిపిస్తోంది.
ఇక చివరిగా మీ అల్లుడు నాకు మీరిచ్చిన దైవమే. ఆయన మీకు పుత్రుడే. మొన్న కంపెనీకి డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఇంకా పది సంవత్సరాలు బాధ్యతాయుతమైన పదవి లో ఉంటారు. వారెప్పుడు మిమ్మల్ని పితృసమానులుగా భావిస్తారు. మీరు తప్పకుండా ఈ వయస్సులో మా దగ్గర ఉండడమే మంచిది. మీ ప్రేరణ వల్లే  మేము అమ్మ పేరున ప్రతి ఏడాది ప్రేమసమాజం లో అన్నదానము మరియు ఇద్దరు విద్యార్థుల చదువుకు ఏర్పాటు చేసాము. తల్లిదండ్రులు పరదేవతా స్వరూపాలు అని మీరే చెప్పారు. అందుకే నేను, మావారు మిమ్మల్ని మా దగ్గరకు తీసుకువచ్చి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తారని ఆశిస్తు.

ప్రేమతో నాన్నకు
గాయత్రి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!