ఏం మిగిలింది?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: బండారు నారాయణ
ముసుగు దుప్పట్లో
ఊపిరి బిగబట్టి
మొక్కలెన్నాళ్లు
బ్రతికుంటాయి..?
రాశులన్నీ కొట్టుకుపోయి
కళ్ళాలు
ఖాళీ కంచాల్లా
దర్శనమిస్తున్నాయి.
బస్తాల్లో వడ్ల గింజలు
బాలింతలయ్యాయి.
పొలం గట్లమీద
ఎడ్లు లేవు
నెరలు కొట్టిన నేలలో
గింజలేరుకునే
పిచ్చుకలు లేవు.
రైతన్న చూపు మాత్రం
ఆకాశం వైపే ఉంది.
వర్షం కోసం ఒకప్పుడు
చేను వైపు చూడలేక ఇప్పుడు
మట్టిపిసికడం మాత్రేమే
తెలిసిన రైతు
సాయం కోసం
చేతులు పిసకలేడు.
మొలకెత్తింది
నానిపోయిన
గింజ మాత్రమే కాదు
రేపేంటి ?అన్న ప్రశ్న కూడా.
(గోదావరి జిల్లాల్లో వర్షాలకు నాశనం అయిపోయిన వరిచేలు)