ఒంటి స్థంభం మేడ
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: ఎం. వి. ఉమాదేవి
రేడియో, టీ.వీ మాధ్యమాల తర్వాత అన్నీ ఒకేసారి అనుభవంలోకి తెచ్చిన పరికరం అభివృద్ధి చేసిన చరవాణి. లెక్కలేనన్ని ఉపయోగాలతో మనిషిని వశీకరణ చేసుకొని, లాభం నష్టం సొంత ఎంపిక తోనే అనేలా, ఒక వీడని నీడగా మారింది. ప్రపంచం మొత్తం గుప్పిట్లో ఉంటే ఆ ధీమా ఇప్పుడు వ్యక్తిగతంగా అందుకున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, సామాజిక సేవ ఇలాంటి ప్రతి వ్యవస్థలో చరవాణితో గొప్ప వేగవంతమైన అభివృద్ధి. ఇల్లు కదలకుండా సౌకర్యాలు పొందడం నుండి సెకండ్ లో సమాచారం అందుకోవడము, అందించడం విజ్ఞాన శిఖరమే ఇప్పుడు.
దాంతో బాటు “నేను” అనే భావన పెరిగింది. కుటుంబం కంటే సెల్ ఫోన్ సాన్నిహిత్యమే ఎక్కువగా కొంచం స్వార్థం ప్రవేశం. ఇంట్లో పక్క గదిలో వారితో కూడా ఫోన్లో మాటలు, మెసేజ్ ల తో పనులు జరగడంతో ఒంటి స్థంభం బ్రతుకు. అందరు కనిపిస్తారు. అదే సౌకర్యం అనుకుంటే చెప్పేదేముంది..? కానీ సెల్ కు బానిసలుగా యువత కుటుంబం గురించి పట్టించుకోకుండా, తమ లోకంలో తాము ఉండడం మంచిది కాదు. సెల్ కోసమే ఆత్మ హత్యలు వంటి వార్తలు, బ్యాంకు అకౌంట్ ల ఖాళీ వంటివి చాలా బాధ కలిగిస్తాయి. మానవ సంబంధాలకి అర్థం మారుతుంది. అదే సమయంలో మనం కలలో కూడా ఊహించని గొప్ప వ్యక్తుల, కళాకారుల పరిచయం పలకరింపు ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. మితంగా వాడుతూ, పిల్లలకి మంచి, చెడు తెలుపుతూ ఉంటే సెల్ ఫోన్ చేతిలో మంత్ర దండమే. రోజు వారి దినచర్యలో గొప్ప మార్పులు తెచ్చినా, దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారు. పాలు, కూరలు, పని మనిషి, అతిథుల రాక, బడి, గుడి, యాత్ర నమోదు అన్నీ నిముషాలలో జరిగి గృహిణికి సౌకర్యం పెరిగింది. ఇక వాట్సాప్ కవిత్వం సంగతి సరేసరి. ఎన్నో మంచి సమూహాలు కవులకి పట్టం కట్టి, ప్రతిభ ఉన్న వారికీ మంచి గుర్తింపునిస్తున్నాయ్. ఇటువంటి చరవాణిని సద్వినియోగం చేసుకుందాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరినీ కలుపుకొని పోతున్న చరవాణికి కోటి దండాలు..!