తాను తీసుకున్న గోతిలో తానే పడడం
విస్సాప్రగడ పద్మావతి
అనగనగా ఓ కాకి. అది చాలా ఆకతాయి గా ప్రవర్తిస్తుండేది.ఒక సారి ఏనుగు నిదుర పోతుంటే దానితలపై రెట్టలు వేసింది.ఏనుగు లేచి తిరుగుతుంటే సున్నం వేసినట్టు తలంతా తెల్లని మరకలు.
అడవిలో జంతువులు ఒకటేనవ్వు.
ఆ దృశ్యం చూసి కాకి చెట్టుకొమ్మల్లో కిసుక్కున నవ్వుకొనేది. ఇలా అందరినీ ఎదోలా ఆట పట్టించేది. దాని బాధ ఆ అడవిలో మృగరాజుకూ తప్పలేదు. ఎలాగైనా ఈఆగడాలు కట్టించాలనుకుంది సింహం ఒక రోజు అడవిలోని జంతువులను, పక్షులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి.. మంచి ఉపాయం చెప్పమని అడిగింది. వెంటనే తోడేలు ముందుకి వచ్చి చటుక్కున నాకో ఆలోచన తట్టింది..కాకి గోతిలో కాకే పడేలా చేద్దాం అప్పుడు ఎదుటి వాళ్ళను ఏడిపిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో కాకి తెలియజేద్దాం అంది. తోడేలు చెప్పిన ఆలోచన అందరికీ నచ్చి, అలాగే చేద్దాం అని తీర్మానించుకున్నాయి. మర్నాడు తోడేలు చెప్పినట్లుగా అన్నీ కలిసి కాకి ఉండే చెట్టు దగ్గరకు వచ్చాయి .వీటన్నిటిని చూసి అబ్బా ఈరోజు భలే బాగుంది. ఒకేసారి అన్ని జంతువులను ఏడిపించే అవకాశం వచ్చిందని మనసులో సంబరపడిపోయింది. వెనుకా ముందూ ఆలోచించకుండా అనుకున్నదే తడవుగా చెట్టు కింద ఉన్న జంతువులను ఏడిపించాలని చెట్టు మించి కిందకి ఎగిరి తోడేలు పన్నిన వలలో చిక్కింది. వలలో చిక్కిన కాకి ఊపిరాడక ఏం జరిగిందో అర్థం కాక విలవిలలాడింది. కొంతసేపటికి తేరుకొని జరిగినది తెలుసుకొని, తాను ఏడిపించడం వల్ల ఎంతమంది బాధపడ్డారో గ్రహించి, తన తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపపడి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంది. దయగల జంతువులన్నీ .. నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలని ఈవిధంగా చేశాము. ఇకపై ఈ అడవితల్లి నీడలో అందరం కలిసి మెలిసి ,హాయిగా, ఆనందంగా జీవిద్దాం అని అనేసరికి కాకి సంతోషంతో ధన్యవాదాలు తెలుపుకునీ ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి హాని కలిగించని మీలో ఒకరిగా జీవిస్తానని మాట ఇచ్చి తోటి జీవులతో సుఖంగా జీవనం సాగించింది.