ఆకలి రాజ్యం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సంధ్యా సలోమి
ఏమిటీ ఘోరం
ఎవరిదీ పాపం
ఎందుకీ శాపం
75 యేళ్ళ స్వతంత్ర భారతంలో
ఇంకా ఆకలి చావులా
సుసంపన్నమైన భారత దేశంలో
అందరి ఆకలి తీర్చే
అన్నపూర్ణ లాంటి భారతావనిలో
ఆకలితో అలమటిస్తూ
మింగ మెతుకు లేక
మట్టిముద్దలను తిని
అల్లల్లాడుతున్నవారు కోట్లమందా
నేటి బాలలే రేపటిపౌరులని
వారి భుజస్కందాల మీదే
దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని
మన నాయకులు మైకుల్లో
ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి
దులిపేసుకోవడమేనా
అభంశుభం ఎరుగని
అందమైన బాల్యం వారి పాలిట శాపమేనా
కలలు కనే కళ్లల్లో ఇంకిపోని
కన్నీటి సముద్రాలా
ఆడుతూ పాడుతూ
బడికి వెళ్లి చదువుకునే వయసులో
కూటికీ గుడ్డకీ యాచించడమా
సంతోషించే హక్కు వారికి లేదా
కడుపునిండా తినే అదృష్టం లేదా
చదువులు అందని ద్రాక్ష లేనా
ఎవరు రాసారు వారి నుదుటన ఈ రాత
ఏ విధాత వారి తలరాతని మార్చగలడు
ఈ పేదరికాన్ని నిర్మూలించగలడు
వారి అందమైన బాల్యాన్ని తిరిగివ్వగలడు
ఏ విధాత వారి కడుపు నింపగలడు
వారి కలలు పండించగలడు
వారి నవ్వుల్లో పువ్వులు
పూయించగలడు
వారి కోసం కొత్త బంగారు లోకం
సృష్టించగలడు
ఆకలిదప్పులు లేని మరో ప్రపంచాన్ని
నిర్మించగలడు