కథ పునరావృతం
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
అమ్మగారు అమ్మగారు అంటూ ఆయాసపడుతు పనిమనిషి లచ్చి సుభద్రమ్మ దగ్గరకొచ్చి ఇది విన్నారా అంటూ ఆగిపోయింది. ఏమిటి అంత ఆయాసపడుతు చెపుతున్నావు అంటే ఎదురింటి ప్రకాశం బాబు ఉదయాన్నే అదేదో జబ్బు వచ్చి పోయారుట అంది. సుభద్రమ్మ గారికి గుండె ఆగినంత పని అయింది. నోటమాట రాలేదు. ఎంత మంచివాడు ప్రకాశం పిన్నిగారు నేను మీ పింఛను డబ్బులు బ్యాంక్ పనులు చేస్తాను ఈ వయస్సులో మీరు తిరగొద్దు ఎలాగు నేను బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ ని అంటూ కొడుకులా పనులు చేసేవాడు.
అయ్యో సావిత్రక్కయకు ఎంత కష్టం ఈ వయస్సులో అలాగే ఇద్దరి పిల్లలతో వయస్సులో ఉన్న ప్రకాశం భార్య సుశీల ఎలా బతుకు వెళ్ళదీస్తుంది అని పరిపరి విధాల ఆలోచనలతో ఒసే లచ్చి నీవు తలుపులు వేసిరా అంటూ సుభద్రమ్మ ఎదురింటి కి వెళ్ళగా ,కొడుకు తల దగ్గర ఉన్న డెబ్భై ఏళ్ళు దాటిన సావిత్రమ్మ, రా చెల్లి నా కొడుకు మమ్మల్ని అన్యాయం చేసి వాడిమానాన వాడు వెళ్ళి పోయాడు. మాకు దిక్కెవ్వరు అని ఏడుస్తుంటే సుశీల, పిల్లలను పట్టుకుని మౌనంగా భర్త వైపే చూస్తుంది. రెండు రోజుల నుంచి జ్వరం, ఆయాసపడుతు ఉంటే సెలవుపెట్టి పరవాలేదు అని ఇంటి వైద్యం చేసాడు. రాత్రి ఆయాసం ఎక్కువై, నీరసంగా ఉంటే ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు దోమ కొట్టడం వల్ల వచ్చే డెంగ్యూ తో రక్తకణాలు బాగా తగ్గిపోయాయట. డాక్టర్లు ప్రయత్నం చేసినా లాభం లేక పోయిందని ప్రకాశం మేనమామ సుబ్బారావు చెపుతుంటే నాకు గతం గుర్తుకొచ్చింది.
నలభై సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలు, అత్త మామలతో ఆనందంగా ఉన్నవేళ కలరా తో భర్త రామారావు అర్ధంతరంగా చనిపోతే పిల్లలని, అత్తమామలని చూసుకుంటూ ప్రైవేటు టీచర్ గా ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసి ,కష్టపడి ఎవరేమన్నా పిల్లలకి ఉన్నత చదువులు చెప్పించి అత్తమామల సహకారంతో పెళ్ళిళ్ళు చేసి, తరువాత వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల సపర్యలు చేయడం. ఉన్నఊరుని భర్త కట్టిన ఇంటిలో ఓపిక ఉన్నంతవరకు ఉండి మీదగ్గరకు వస్తాను అంటే పిల్లలు నా భాద్యతను స్నేహితుడు ప్రకాశానికి అప్పచెప్పడం మరువలేనిది. ఇప్పుడు నాకు జీవితం పునరావృతం అయిందని పిస్తోంది. కాని విధి బలీయం కదా…!!