కోడలు ఉపాయం
రచన: కవిత దాస్యం
రామాపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో, అని సూరమ్మ కు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమి తింటుందని గమనించేది. ఒకరోజు లలిత పక్కింటావిడ తో మాట్లాడుతుండగా, ఆవిడ పుల్లని దోసెలు , ఎర్రటి కారం తో నంజుకుని తింటే రుచిగా ఉంటాయని చెప్పింది. అప్పటినుంచి లలితకు పుల్లని దోసలు ఎర్రటి కారం తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్ర కారం దోసెల పిండి పెట్టుకొని తీరా దోశ వేసేటప్పటికి పెనం మీద సుయ్ అని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తింటున్నావేంటి అంటూ తిట్ట సాగింది. గబగబా ఆ దోసేలన్ని తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలుతినాలన్న ఆశ చంపుకోలేకపోయింది. నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఎర్రకారం చేసి దోసెల పిండి రుబ్బిపెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయ్ శబ్దం రాగానే సూరమ్మ పరుగుపరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే దోశలు కాదు అత్తయ్య పెనం వేడి ఎక్కిందో లేదో అని నీళ్ళు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే లే అని వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలానే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు, అదే తనయితే చూపులతోనే కనిపెట్టేసేది అనుకుందిసూరమ్మ .మళ్లీ సుయ్శబ్దం వచ్చిన సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత.
నీతి :
మనల్ని బాధ పెట్టే వాళ్ల నుంచి చిన్న చిన్న ఉపాయాల తో తప్పించుకోవచ్చు.