నానెందుకు సెప్పాల

నానెందుకు సెప్పాల

రచయిత :: మంగు కృష్ణ కుమారి

డి మోనిటరైజేషన్ టైమ్ లో! ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెక్కా, వాటి బిల్లులూ నమోదు చేయాలని నూకరాజు బయల్దేరేడు.

కూరగాయలు అమ్మే ఆడవాళ్ళని మొదట అడిగేసరికి ఒక్కొక్కళ్ళకీ ఒళ్ళు మండింది.

“నీకెందుకొరే! నా కాడ బంగారవే ఉందో? కాకి బంగారవే ఉందో” నిగ్గదీసింది ఒక మహిళ.

“నాక్కాదమ్మా! ప్రభుత్వంకి కావాలి.అంతేకాదు. మీ దగ్గర ఉన్న బంగారం ఎక్కడ కొన్నారో ఆ బిల్స్ కూడా చూపించాలి”

“ఏటీ! రసీదులా? మాఁవు కొనకుండా ఒట్టుకొచ్చీసినం అనుకుంటున్నవేటి?” ఇంకో ఆవిడ ఆగ్రహం.

“అలా ఎవరన్నారమ్మా! మీరు కొనుక్కున్నవి , లేకపోతే మీఅమ్మమ్మలో మామ్మో బహుమానంగా ఇస్తే ఆ రసీదులు కూడా దాచాలి”

“ఏటి? ఈ జడ బిల్ల మా అవ్వ కొనిందీ, ఈ సిగ్గుబిల్ల మా బాప్ప కొనిందీ ఇయన్నీ సెప్పాలా? మా అవ్వ ఎలగ తెచ్చిందో ఎలగ కొన్నాదో నాకేటి తెలుత్తది? మాయమ్మకే తెల్దు. నీకెందుకా ఊసు?”

“అసలు‌ మొదట మీ దగ్గర ఎంతంత బంగారం ఉందో చెప్పండమ్మా!ఎన్ని తులాలు? ఎలా కొన్నారు? ”

పూనకం వచ్చేసింది మహిళలందరికీ.

“ఏటి బాబు, ఏటంటన్నవ్! మావెంత బంగారం కొన్నావో ఎలగ కొన్నావో సెప్పాలా? నాకాడ ఎంతుందొ మా అత్తకీ తెల్వదు. మా యమ్మకీ తెల్వదు. నీకా సెప్పేది?”

“అయ్యో! అడుగుతున్నది ప్రధానమంత్రి తల్లీ” ఉద్యోగి రామ బాణం వదిలినట్టు అన్నాడు.

ఊగుతూ ఓ మహిళ కరాఖండీగా చెప్పింది. “నానెంత కొన్నానో నామొగుడికే సెప్పను. ఇక మోడీకి సెప్తానా! ఎల్లెల్లు” అపర రామ భక్తురాలిలాగే ఆ బాణాన్ని తిప్పికొట్టేసింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!