గుణపాఠం
రచన: కవితా దాస్యం
ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి రెండు తలలు, రెండు ముక్కులు , రెండు మెడలున్నాయి, కానీ కడుపు ఒకటే ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతుండగా, దానికి ఒక దేవతాఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, ఆహా ఎంత రుచి గల పండు, ఎన్నో పండ్లు తిన్నాను. గాని దీనంత రుచిగల పండు తినలేదు. అనసాగింది మొదటి నోరు. నాకు కూడా సగం ఫలం ఇవ్వవా రుచి చూస్తాను అని రెండవనోరు. నేను తిన్నా, నువ్వు తిన్న ఓకే కడుపులోకి కదా పోయేది. అంటూ మిగతా పండునంత తినేసింది మొదటి నోరు. ఎలాగైనా మొదటి నోటికి గుణపాఠం చెప్పాలని అనుకుంది రెండవ నోరు. ఆ రోజు నుండి మొదటి నోటితో మాట్లాడడం మానేసింది. రెండవ నోరు అవకాశం కోసం ఎదురుచూస్తూ, రెండో నోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విషపు ఫలము కనబడుతుంది. నీవు దానిని తింటే నువ్వు నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఓకే పొట్టకదా అని మొదటి నోరు రెండో నోటిని అడ్డుకుంటుంది, ఆ విషపు ఫలం తినవద్దని వాదించ సాగింది.
విషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండవ నోరు, మొదటి నోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటి నోరు అనుకుంటున్న తరుణంలో, చూసావా నేనే విషపుఫలం తింటే నువ్వు నేను ఇద్దరం చచ్చేవాళ్ళం.
మనిద్దరికీ ఓకే పొట్ట ఉన్న మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ, సజావుగా, సఖ్యత గా ఉంటే సమస్యలే రావని చెప్పింది రెండో నోరు. అవునన్నట్లుగా సిగ్గుతో తలదించుకుంది మొదటి నోరు.
ఆ రోజు నుండి రెండో నోటితో సజావుగా, సఖ్యతగా ఉండసాగింది.
నీతి: కలసి ఉంటే కలదు సుఖం.
ఏదైనా పంచుకొని తిన్న దాంట్లో ఉన్న ఆనందం ఒక్కరుగా తినడంలో ఉండదు. పంచుకుంటే తిండి కరిపోతుందేమో గాని, ప్రేమ పెరుగుతుంది.