ఆ రోజులే నయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎస్. ఎల్. రాజేష్
నేస్తమా గుర్తున్నాయా
చిన్ననాటి మధురానుభూతులు
జారుతున్న లాగు ను
పైకి లాక్కుంటూ
బడికి పరుగెట్టిన రోజులు.
ఒక్క చిత్తు పుస్తకంలో
ఆరు పాఠాలు మిక్చర్ చేసి
ఆకళింపు చేసుకున్న క్షణాలు.
జామకాయ ముక్కలు,
ఉప్పు లో ఊరిన ఉసిరి ముక్కలు
కాకి ఎంగిలి చేసుకుని
తిన్న చిలిపి రోజులు.
అలక వచ్చిన రోజు
నా ముక్క నాకిచ్చెయ్ అంటూ
బుంగమూతి పెట్టుకుంటే..
గోముగా తూచ్ అంటూ
మళ్లీ చిరునవ్వులు
పూయించిన రోజులు..
ఎక్కాలు రాలేదని లెక్కల మాస్టారు
గోడ కుర్చీ వేయించడం,
వేమన పద్యం చెప్పలేదని
తెలుగు టీచరు చెవి మెలేయడం..
మట్టిలో ఆడి ఇంటికి వెళ్తే
మురికి పట్టిన ఒంటిని చూసి
అమ్మతిట్ల తో తలంటిన రోజులు.
అవన్నీ ఇప్పటి తరానికి తెలియని
అపురూపమైన జ్ఞాపకాలు.
బరువెక్కిన చదువులు,
చరవాణి ఆటలు, బాధ్యతల మూటలు..
ఆ రోజులే నయం కదా!