బ్రతుకు నాటకం

బ్రతుకు నాటకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

“ఒరేయ్ పిల్లలు! ఇలా రండి , ఏంటి మీ చేతుల్లో ఉంది? అంటూ అప్పుడే చెత్త కుప్పలో పారయ్య బోతున్న ఒక ప్లాస్టిక్ సంచిని చూసి ఆ పిల్లల్ని అడిగాడు సింహాచలం, ఏం లేదు అంకుల్! మా అమ్మ ఈ మందులన్నీ పాడైపోయాయి, పారేయిమని చెప్పింది, అని అనగానే సరే ! ఇలా ఇవ్వండి, నేను పారేస్తాను, మీరు పొండి ! అంటూ ఆ ప్లాస్టిక్ కవర్ విప్పి చూశాడు, సరిగ్గా చదువు రాని సింహాచలం మెల్లిగా కూడబలుక్కుని చదివాడు, అవన్నీ ‘ఎక్స్పైరీ డేట్ ‘ అయిపోయిన టాబ్లెట్లు, క్యాప్సూల్స్, టానికులు , చూసి ఛీ, వెదవ గోల, ఇవి ఎందుకు పనిచెయ్యవు, అంటూ నిరాశగా  తన ఇంటి అరుగుమీద కూర్చుని బాధ పడ సాగాడు.
ఎందుకంటే, చిన్నతనం నుంచి సరిగ్గా చదువు అబ్బక , ఏ పని దోరికితే ఆ పని చేయడం, ఆరోజు తిండికి సంపాదించడం, విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడంతో, పల్లెటూరు లో ఉన్న సింహాచలం కుటుంబం ఏదైనా సంపాదించుకు రమ్మని బలవంతంగా గా పట్టణానికి తగిలేసింది. ఆ రోజు నుంచి అతను చేయని పని లేదు, ఎక్కడ నిలకడగా ఉద్యోగం చేయడం ఇష్టం లేక, జనాల్ని ఏదోరకంగా మోసం చేస్తూ, ఆ రోజు తిండి సంపాదించుకునే వాడు సింహాచలం. తనకున్న తెలివితేటలతో ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ కాలం గడపసాగాడు, ఆరోజు కూడా మిట్టమధ్యాహ్నం కడుపు కాలు తుండడంతో, ఎలాగరా దేవుడా! అంటూ కడుపు రాసుకుంటూ, ఆకలితో ఉన్న సింహాచలానికి తళుక్కుమని ఒక ఆలోచన, పిల్లలు వదిలేసిన ప్లాస్టిక్ బ్యాగ్ చూసిన వెంటనే కలిగింది.
వెంటనే తన దగ్గర ఉన్న చివరి చిల్లర డబ్బులతో, మెడికల్ షాప్ లోకి వెళ్లి, ఒక ‘ప్లాస్టర్ రీలు, ‘కొంచెం దూది’ కొని తన కుడి వైపు బొడ్డ చివరన, కొంచెం పెద్దగా దూది పెట్టి దాని చుట్టూరా ప్లాస్టర్ అతికించి, దానిమీద అ చిన్న ఎర్ర మచ్చలు ఉండేటట్టు చేసి, తనను తాను మరోసారి పరీక్షించుకొని రోడ్డు మీద పడ్డాడు సరికొత్త మోసపూరిత మాస్టర్ ప్లాన్తో.
కాస్త డబ్బున్న వాళ్లు కనబడేసరికి, తన మాసిపోయిన, వెలిసిపోయిన షర్ట్ ని పైకెత్తి, సార్ !మీరు సహాయం చేయాలి నాకు మొన్న కడుపులో ఆపరేషన్ చేశారు, అంటూ తన శరీరం మీద ఉన్న ‘ప్లాస్టర్ తో, దూదితో కూడిన గాయాన్ని చూపిస్తూ, సార్ ఇదిగోండి! ఈ మందులు వేసుకోవాలి, అది కూడా భోజనం చేశాకే, నా దగ్గర ఉన్న డబ్బంతా హాస్పటల్కి పోశాను, నా దగ్గర చిల్లిగవ్వ లేదు అర్జెంటుగా మందులు వేసుకోవాలి,  తన దగ్గర ఉన్న మందుల బ్యాగ్ తెరిచి చూపిస్తూ, నేను భోజనం చేస్తేనే అవి వేసుకోవాలి, కాస్త దయుంచి, నాకు భోజనానికి డబ్బులు సర్డుతార, నొప్పి భరించలేకుండా ఉన్నాను, అంటూ కాస్త ఒంగి ఒక ఒక చెయ్యి నీ కడుపు మీద పెట్టుకొని, మరో చేతితో దీనంగా అడగ సాగాడు సింహాచలం, తనదైన అపూర్వ నాటక ప్రతిభతో. చూసినవాళ్లంతా ఎంతో దయతో, పదో పరకో ఇస్తూ, అయ్యో పాపం! ఇంత ఎండలో ఎందుకుయ్యా నడుస్తావు,  ఈ డబ్బులు తీసుకొని భోజనం చేయు, ఆ తర్వాత మందులు వేసుకో ,ఒక చెట్టు నీడను పడుకో అంటూ డబ్బులు ఇవ్వడం చూసేసరికి, తన నాటకం రక్తి కడుతున్నందుకు రెట్టించిన ఉత్సాహంతో, తన నాటకాన్ని ఇంకా  రెట్టించి, అయ్యా! అమ్మ అనుకుంటు ఆ రోజంతా బాగా సంపాదించి రెండు పూటలా సుష్టుగా భోంచేసి, ఎంతో హాయిగా పడుకున్నాడు సింహాచలం. ప్రతి దాతను, అయ్యా !మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆ దేవుడి దయవల్ల అంటూ నమస్కరిస్తూ, కాస్త కుంటుకుంటూ నడుస్తున్నట్టు నటించి, మరొక దాత దగ్గరికి వెళ్లి బ్రతుకు నాటకాన్ని కొనసాగిస్తూ, మళ్ళీ సాయంత్రం ఏడు గంటల తర్వాత, మరొక జంక్షన్లో అదేవిధంగా నాటకాన్ని కొనసాగిస్తూ, ఒక్క రోజులోనే పది రోజులు తిండికి సరిపడా డబ్బులు వచ్చే సరికి , ఆహా అంతా ఆ పిల్లలు ఇచ్చిన పాడైపోయిన మందులు వల్లనే కదా అనుకుంటూ సుఖంగా నిద్ర పోయాడు సింహాచలం. అలాగ  ఊరిలోనే అన్ని జంక్షన్లు తిరిగిన తర్వాత, పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు కూడా వెళ్లి, తన మోసపూరిత నాటకాన్ని ప్రదర్శించి, నెలలు తరబడి కష్టపడకుండా డబ్బు సంపాదిస్తూ, అనుభవించసాగాడు సింహాచలం. ఆరోజు కూడా అదే పద్ధతిలో బాగా ధనవంతులు నివసించే  ప్రాంతానికి వెళ్లి ఎంతో ప్రయత్నించాడు, కనపడ్డ కారు నల్లా ఆపి, తన అసమాన నటనా సౌరభం తో ఎంత నటించిన, ఎంత మందిని అడిగిన ఒక్క బోణీ కూడా అవ్వక నీరసించి పోయి, మిట్టమధ్యాహ్నం ఒక షాపింగ్ మాల్ దగ్గర నిల్చుని అయ్యా! నా కడుపు ఆపరేషన్తో ఉంది, చాలా నొప్పిగా ఉంది ,షర్ట్ పైకి తీసి తన కడుపు కున్న ప్లాస్టర్ దీనంగా చూపించిన ఎవరో ఒకరు పది రూపాయలు, 20 రూపాయలు తప్ప, ఎక్కువ జమ పడక, ఏం చేయను రా దేవుడా!! అంటూ ఒక సోడా తాగి అయ్యా, నేను భోజనం చేస్తే గాని ఈ మందులు వాడకూడదు, అంటూ తన ఆపరేషన్ అయిన కడుపు ని చూపిస్తూ డబ్బులు సాయం చేయండి, లేకపోతే చచ్చిపోతాను, ఈ నిరుపేద ఆకలి తీర్చండి! అయ్యా అంటూ ప్రాధేయ పడుతున్నా వేళ, అప్పుడే షాపింగ్ మాల్ లో నుంచి బయటకు వచ్చిన ఒక ‘వ్యాపార వేత్త ‘తన మెర్సిడెస్ బెంజ్ కారు తలుపు తీస్తున్న సమయంలో, పరుగు పరుగున వచ్చి, సింహాచలం తన కథంతా దయనీయంగా చెప్పేసరికి, అయ్యో, ఎంత పని అయింది, నీ ఆపరేషన్ కుట్లు ఆరకుండానే బయటకు వచ్చావా? ఎంతో బాధాకరం! అంటూ ఆ వ్యాపారవేత్త అనగానే సింహాచలం మరికొంచెం ఒంగి పోతూ, సార్, చూడండి ఇన్ని మందులు వేసుకోవాలి, అవి కూడా భోజనం చేసిన తర్వాతే, నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ హాస్పిటల్ కి అయిపోయాయి, చేతిలో ఎర్రనీ ఏగాణీ లేదు, అంటూ షర్టు పైకెత్తి తన కుట్లు చూపించాడు,
నాకు భోజనానికి సహాయం చేయండి, లేకపోతే ఆకలితో ఈ రోడ్డు మీదే సచ్చిపోతాను, అంటూ వ్యాపారవేత్త కాళ్ళకి మొక్కుతు అడిగేసరికి, అరే, లే పద ! నేను కూడా హోటల్ కి భోజనానికి వెళుతున్నాను, నీకు కూడా బాగా పెట్టిస్తా, నాతోపాటు రా, నీ కావలసింది తిని, మందులు వేసుకో! అనేసరికి అయ్యా, ఇంత పెద్ద కారులో మీతో పాటు హోటల్ కి వస్తే, మీ పరువు పోతుంది, నా బట్టలు అస్సలు బాగోలేవు, ఎలా రాను సార్? కొంచెం డబ్బులు ఇప్పించండి, నేను బయట భోజనం చేస్తాను, మందులు వేసుకుంటాను మీ దయతో , అని తన నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తూ అన్నాడు సింహాచలం ‘చ, చ్చా! అదేం కాదు, నాకు మానవత్వం ఉంది, ఆకలితో ఉన్న నిన్ను నడిరోడ్డు మీద వదిలేస్తానా? పద పద కారు ఎక్కు, అంటూ బలవంతంగా దగ్గరుండి వెనక సీట్లో సింహాచలాన్ని కూర్చోబెట్టి, ఒక అతిపెద్ద హోటల్ ముందు కారు ఆపాడు ఆ వ్యాపారవేత్త. బిక్క మొహంతో తన ఎత్తు పారనoదుకు, సార్,!  నేను రాలేను అండి, ఇంత పెద్ద హోటల్లో మీతో పాటు భోజనం చేసే అర్హత ఏ కోశానా లేదు నన్ను క్షమించండి! నేను దిగిపోయి వెళ్ళిపోతాను, మీరు డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు, నా పాట్లు నేను పడతాను, అంటూ దిగి వెళ్ళిపోబోతున్న సింహాచలం ని ఆపి, చెయ్యి పట్టుకుని పద ఇంత వరకూ వచ్చాక నిన్ను వదిలేస్తానా, అంటూ చేయి పట్టుకొని  హోటల్లోకి తీసుకుపోయాడు వ్యాపారవేత్త. చూడండి! ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, చక్కగా ఏది కావాలి అది తిని వెళ్దాం రండి! అంటూ ‘చికెన్ బిర్యాని, మటన్ కర్రీ , వాటితో పాటు చపాతీలు, రైస్ అలా ఎన్నో వంటకాలు ఆర్డర్ చేశాడు ఆ వ్యాపారవేత్త. ఆ పదార్థాలను చూసేసరికి, నోట మాట రాక సార్ !మీరు దయామయులు అంటూ తన ప్లేట్లో వడ్డించిన రుచికరమైన భోజనం తన జన్మలో ఎరగడు సింహాచలం, ఆవురావురుమని తింటూ ఆనందించ సాగాడు. అలా కడుపు నిండా తిన్నాక, వెయిటర్ తెచ్చిన చల్లని లస్సీ త్రాగుతూ, ఎంతో తృప్తిగా త్రెనుస్తు, సార్!  ఈ రోజు నా జన్మలోనే రుచికరమైన భోజనం చేశాను, మీ రుణం తీర్చుకోలేను, ఇక పదండి సార్ వెళ్దాం,! మీ విలువైన సమయాన్ని వృధా పరచను, మీ కుటుంబానికి ఆ ‘భగవంతుడు సకల ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలు కలుగజేయాలని నేను ‘వెంకన్న గుడిలో’ ప్రార్థిస్తాను ! అంటూఉద్వేగంగా అంటున్న సింహాచలం మాటలను వింటూ, అరే, కూర్చో! ముందు మందులు వేసుకో, అప్పుడు తీరికగా వెళ్దాము, అని వ్యాపారవేత్త అనేసరికి ఒక్కసారి ముచ్చెమటలు పట్టాయి సింహాచలానికి, ఎందుకంటే ఆ’ ఎక్స్పైరీ డేట్’ అయిపోయిన మందులు, ఆయన ముందు వేసుకోవాలి, అసలు ఏమవుతుందో తెలియక కంగారు పడుతూ, సార్ ! నేను ఇంటికి వెళ్ళాక సావకాశంగా ఆ మందులు వేసుకుంటాను, అని తన వణుకుతున్న  గొంతుతో చెప్పేసరికి, ఏమయ్యా! తొందరగా మందులు వేసుకోవాలి, భోజనం చేశాక, లేకపోతే చచ్చిపోతాను! అని కదా నువ్వు అందరినీ డబ్బులు అడుగుతున్నది. అందుకే నా మనసు కరిగి నేను స్వయంగా నిన్ను హోటల్ కి తీసుకువచ్చి,  భోజనం పెట్టించాను , ఆ మందులు నా ముందు వేసుకుని, చక్కగా వచ్చి కారులో కూర్చో! మీ ఇంటి దగ్గర దిగ పెడతాను, మరో రెండు రోజులు భోజనానికి కూడా డబ్బులు ఇస్తాను, అని తన సహృదయాన్ని చాటుకున్నాడు ఆ వ్యాపారవేత్త.
సింహాచలం కి “కాళ్ళకింద భూమి జారిపోతున్నట్లు ఆనిపించింది, “ఎందుకంటే ఆ కాలం తీరిన మందులు వేసుకుంటే, ప్రాణం మీదికి వస్తుంది, ఒకవేళ నిజం చెబితే ఆ వ్యాపారవేత్త , హోటల్ స్టాఫ్ తో కలిపి చిదకదన్ని జనాలను మోసం చేస్తున్నాడు! అన్న నెపంతో పోలీసులు నీ పిలుస్తారు, ఏంటి దేవుడా !!నన్ను “పద్మవ్యూహంలో పడిపోయిన అభిమన్యుడులాగ,” లోపలికి వచ్చాను గాని, బయటకు పోయే దారి లేదు”! చచ్చినట్లు ,ఆ పాడైపోయిన మందులు ఆయన ముందు వేసుకుని, బతికితే బతుకుతాను లేదా సచ్చిపోతా !! అన్న నిశ్చయంతో, రెండు ట్యాబ్లెట్లు, రెండు క్యాప్సిల్స్ వేసుకొని, ఆ వెంకన్నని ప్రార్థిస్తూ సార్! అన్నీ  మందులు వేసుకున్న, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు! అంటూ వ్యాపారవేత్త కారు దగ్గరకు వెళ్లి, సార్ ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే, నేను మెల్లిగా వెళ్లిపోతాను, మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి, అని అనేసరికి ఒక’ 500 రూపాయల నోటు’ సింహాచలానికి ఇస్తూ, చూడు చక్కగా ఇంటికి వెళ్లి పడుకో, మళ్లీ ఏదైనా అవసరం ఉంటే, షాపింగ్ మాల్ దగ్గర కి వచ్చి, నా పేరు చెప్పు, నీకు తగిన సాయం చేస్తాం! అంటూ తన కారులో కూర్చుని వెళ్ళిపోయాడు ఆ వ్యాపారవేత్త, ఆ తర్వాత అదే రోడ్డు లో నడుస్తున్న సింహాచలానికి, చిన్నగా గుండెల్లో దడ, శరీరమంతా వణికి పోతూ, ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితులు లో ఒక రోడ్డు పక్క కూర్చుండిపోయాడు, రోడ్డుమీద నడుస్తున్న మనుషులు, కూడా మసక, మసకగా అంతా అలికేసినట్లు కనబడితున్డేసరికి, ‘ఓరి భగవంతుడా! నిజంగా నేను చేసిన పాపాలు, మోసాలు కలిసికట్టుగా నా మీద యుద్ధం చేస్తున్నాయి, ఒకవేళ ఈ రోజు బ్రతికి ఉంటే, నేను ఏ జన్మ లోనూ ప్రజలకు మోసం చేసి, డబ్బు సంపాదించను, నాకు బాగానే బుద్ధి చెప్పావయ్యా, నన్ను మనసారా క్షమించు తండ్రి, !! అంటూ దూరంగా కనబడుతున్న “వెంకన్న స్వామి “ఆలయ గోపురానికి, పదేపదే దండం పెడుతూ స్వామి!! ఒకవేళ రేపటికి నేను గాని ఈ ఈ తేదీ అయిపోయిన, (expiry date) మందులు వాడటం వలన, చచ్చి పోయే ప్రమాదం ఉంది, ఒకవేళ నా పాపాలు క్షమించి నీవు బ్రతికిస్తే, నీ గుడి ముందు మెట్లమీద కూర్చుని బిచ్చం అడుక్కునీ బతుకుతాను, ఇప్పటికే నా శరీరం నల్లగా మారుతున్నది, నన్ను ఎవరూ రానివ్వరు, కనుక నాకు ప్రాణబిక్ష పెడితే, నీకు సదా నమస్కారం చేస్తూ బిచ్చం అడుక్కొని, పరులకు అన్యాయం చేయకుండా నీ చల్లని నీడలో, నా జీవితం సాగిస్తాను, అంటూ కిందపడిపోయాడు సింహాచలం.
ఆ మర్నాడు తనకు తెలివి వచ్చేసరికి ఎంతో కృతజ్ఞతతో ఆ ‘వెంకన్న స్వామికి’ మొక్కుతూ, “అయ్యా !అమ్మా దయుంచి కొంచెం బిచ్చం పెట్టండి!  అంటూ ఆ ‘వెంకటేశ్వర స్వామి’ గుడి మెట్ల మీద తను చేసిన మోసాలకు, ఆ దేవుని క్షమాభిక్ష కోరుతూ, తన జీవితం గడపసాగాడు సింహాచలం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!