నా దేశం
రచన: శృంగవరపు శాంతి కుమారి
అఖండ సౌభాగ్య సంపదలతో
పచ్చని పైరు లతో
అందమైన పండ్ల తోటలతో
పాడి పంటలతో
సస్యశామలంగా శోభిల్లే భారత భూమి నేడు అగ్ని జ్వాలలో కాలి భూడిదైపోతుంది…..
ఎప్పుడు విజ్ఞానపథంలో పయనించే నా దేశం రెక్కలు విరిగి
రిక్తహస్తాలతో సాయం కోసం ఎదురు చూస్తుంది…
నేడు చెయ్యని తప్పుకు బంధించబడే నిర్దోషిలా
శిక్ష అనుభవిస్తుంది !
శత్రువులను తరిమి తరిమి
గుండెల్లి చీల్చి నెత్తురు సెలయేరులా పారించే వీర భూమి వెక్కి వెక్కి ఏడుస్తుంటే….
ఎముకులన్ని పెళ పెళ విరిగి నట్లు /
గుండెపై సూదులతో గుచ్చి నట్లు /
తూటాలతో శరీరమంతా గాయపరచి నట్లు / మనసు క్షోభిస్తుంది !
పవిత్ర జలాలతో పులకరించి పలకరించి,
మహనీయుల పాద స్పర్శ తో పవిత్రమైన పుణ్యభూమి నేడు స్మశానమై…
గాలి నీరు ఆహారం కలుషితమై విషంలా మారి….
నడయాడే రాహదారి ముళ్ల బాటగా మారి….
కాళ్ల కు సంకెళ్లు బిగించి…
ఊపిరాడనీకుండా ఊభిలోకి నెట్టేసి
రక్తమాంసాలను పీక్కు తినే రాబందులకు ఆలవాలమై…
శ్రమైక జీవుల డొక్కలు మాడి/
తనువు అస్థిపంజరమై/
జీవితాలు అస్తవ్యస్థమై పోతుంటే….
నిన్న మొన్నటి వరకు
ఏదో భ్రమలో బ్రతికానేమో అనిపిస్తుంది !
ఉహాలన్నీ ఆవిరైపోయి…
మనసు లో భావాలన్నీ చెల్లా చెదురైపోయి….
మనిషి ఉనికిని కోల్పోయి
మనుగడ లేని మట్టి దిబ్బగా మారకముందే…
భ్రమను వీడి వాస్తవం లోకి అడుగుపెడదాం !
మాతృభూమిని కాపాడుదాం !!
***