నిజమైన నాయకుడు
-చంద్రమౌళి భవానీ శంకర్ శర్మ
ఏంటయ్యా రాజూ ఇది, ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన అన్ని ముగిసిపోయినట్లేనా? అదే మనసులో పెట్టుకుని ఆఖరుకు గుండె పోటు వరకూ తెచ్చుకున్నావు. ఇలా అయితే నిన్నే నమ్ముకున్న అందరి పరిస్తితి ఏమిటో ఆలోచించావా అని అడిగాడు సత్యం.
నా బాధ ఇప్పుడు ఓడిపోయినందుకు కాదు సత్యం. ప్రజల్లో మనిషిగా ఉంటూ నేను ఎంత చేసినా వాళ్ళు నన్ను గుర్తించడం లేదు. ఒక్క పని కూడా వాళ్ళ కోసం చెయ్యని వాడిని కుర్చీ ఎక్కించారు. అదే బాధగా అనిపించింది అన్నాడు రాజు.
చూడు రాజూ, నీకు గుండె పోటు వచ్చి స్పృహ లో లేనప్పుడు నిన్ను చూడటానికి ఎంత మంది వచ్చారో నీకు తెలుసా. నువ్వు చేసే మంచి పనులు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. అంతెందుకు, నీకు వైద్యం చేసిన డాక్టర్ తన పెళ్లి వాయిదా వేసుకుని మరీ వచ్చి నీకు వైద్యం చేశాడు కేవలం నువ్వు ఎప్పుడో తనకు సహాయం చేశావని ఒకే కారణం తో.
అతడు ఈ పని వేరే ఎవరికి అయినా అప్పగించ వచ్చు. కేవలం నీ మీద ఉన్న అభిమానం వల్లనే తనే స్వయం గా వచ్చాడు. అలాగే ప్రజలు కూడా నువ్వు చేసిన మంచి ఎప్పుడూ మరచిపోరు. అని చెప్పాడు సత్యం.
కానీ అసలు అధికారం లేకపోతే ప్రజలకు సహాయం ఎలా చెయ్యగలం. నాయకుడికి సరైన పదవి లేకపోతే ప్రజలకు మంచి ఎలా చెయ్యగలడు సత్యం. అన్నాడు రాజు.
నాయకుడికి కావాల్సింది పదవి కాదు రాజు. తోటి వారి అభివృద్ధి కోసం పాటుపడే లక్షణం. అది నీలో పుష్కలంగా ఉంది.
ఇంతకు ముందు జరిగిన ఎన్నికల సమయానికి అది కొంతమందికే అర్థం అయ్యి ఉండొచ్చు. మిగిలిన వారికి మరికాస్త సమయం పట్టొచ్చు.
నీ ప్రత్యర్థి అందరినీ ప్రలోభ పెట్టి ఆ స్థానానికి వచ్చాడు అనుకుందాం. అయితే అందరూ ప్రలోభాలకు లొంగే వారు కాదు కదా.
అతడు గెలవడానికి ముఖ్య కారణం అతని తండ్రి ఒక గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలవడం కూడా.
వాళ్ళు ఆ స్థానాన్ని మరొకరికి ఇవ్వలేక అతని వారసుడినే తమ నాయకుడిగా ఎన్నుకున్నారు అనుకోవచ్చు కదా.
నీకు ఆ స్థానం లో ఉండి వాళ్ళకి మంచి చెయ్యాలి అంటే ఇప్పుడు ఉన్న నే ప్రత్యర్థి తో పోటీ పడటం కాదు.
ఎప్పుడో చిన్న చిన్న పథకాలతో కూడా ప్రజలకు ఎంతో మంచి చేసిన ఆ నాయకుడి ఆలోచనలను మించి వాళ్ళకోసం నువ్వు ఆలోచించ గలగాలి.
అని చెప్పాడు సత్యం.
నువ్వు చెప్పింది నిజమే, నా ఆలోచనా సరళి మరికాస్త మార్చి నాయకత్వ లక్షణాలను మరింత పెంచుకొని నేను నిజమైన నాయకుడిని అవ్వడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రాజు.
ఇంతలో బయటి నుంచి పరిగెత్తి ఆయాసపడుతూ వచ్చిన వ్యక్తి ” సత్యం గారూ, రాజు గారూ. ఎన్నికల్లో ఎక్కువ గా దొంగ ఓట్లు వెయ్యడం తో గెలిచారు అని మొత్తం నియోజక వర్గం అందరూ గుంపులుగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం తో ఈ ఎన్నికల ఫలితాలను రద్దు చేశారు. అందరూ మీ వైపే మొగ్గు చూపారు. అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు.
న్యాయం కోసం ప్రజల అడుగు పడేలా చేసి నిజమైన నాయకత్వం మొదటి విజయం సాధించింది.
సమాప్తం.
