ప్రావీణ్యం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
కథ : ప్రత్యేకత
రచన : సావిత్రి కోవూరు
సమీక్షకులు :- సావిత్రి కోవూరు
కథ పేరు ‘ప్రత్యేకత.’ ఈ కథలో లాస్య, ఆమె స్నేహితురాలు నిర్మల, లాస్య భర్త ఆనంద్ పాత్రలు.
ఇక్కడ లాస్య ఎంతో దూరం వెళ్లి ఉద్యోగం చేసి వస్తుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చక్కగా నిర్వహిస్తూ ఉంటుంది. లాస్య స్నేహితురాలు నిర్మల 10వ తరగతి వరకే చదివింది ఉద్యోగం చేయదు. ఇంటి పనులన్ని ప్రత్యేక శ్రద్దతో చేస్తు, ఇంటిని రకరకాలుగా అలంకరించడం , పూజగదిని రంగురంగుల దీపాలతో, రకరకాల పువ్వులమాలలతో చక్కగా అలంకరించి నిష్టతో పూజలు చేయడం, పండగ రోజుల్లో స్పెషల్ గా అలంకరిస్తూ ఉంటుంది. స్నేహితురాలి ఇంటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి తనను ఆమెతో పోల్చుకుని ఆమె లాగా తను ఉండటం లేదని ఆత్మ న్యూనతతో బాధపడుతూ కూర్చుంటుంది. అది గమనించిన భర్త “మీ స్నేహితురాలు ఇంటికి వెళ్లి వచ్చావా” అని అడిగే స్థాయికి వస్తుందామె పరిస్థితి. అన్ని విన్న భర్త ఆమె ఉద్యోగం చేయడం లేదు. ఆమెకు చాల ఖాళీ టైం ఉంటుంది కనుక ఆమె దృష్టంతా ఇంటిని చక్కదిద్దుకోవడంతో, అలంకరణలతో, వంటలతో, పూజలతోనే ఆమె తృప్తిగా ఉంటుంది. ఆమె నీలాగా భారి జీతం తెచ్చె ఉద్యోగం చేయటం లేదు. నీవు ఉద్యోగం చేసి వచ్చి పిల్లలకు అన్ని సమకూర్చి మళ్ళీ ఉదయమే లేచి ఉద్యోగానికి పరిగెత్తే మనిషివి. నీకు పూజలు చేయడానికి టైం ఉండదు. అని భర్త వివరించి చెప్పే పద్ధతి చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఈ కథలో స్త్రీల యొక్క మనస్తత్వాలు చక్కగా వివరించారు రచయిత్రి. అంటే ఒకరితో ఒకరు పోల్చుకోవడం అనవసరం. ఎవరి ప్రతిభ ఎవరి ప్రత్యేకత, ప్రావీణ్యం వాళ్లకే ఉంటుంది. అందరికీ ఒకే పనిలో ప్రావీణ్యం ఉండదు. ఎవరి ప్రత్యేకత వాళ్లకే ఉంటుంది. కొందరికి కళలపై అభిరుచి ఉంటుంది కాని, చదువు చక్కగా రాదు. కొందరికి చదువు బాగా చదువుతారు కాని కళాభిరుచి ఉండక పోవచ్చు. ఇలాగా ఎవరి ప్రత్యేకతలతో వాళ్లు వెలుగుతుంటారు. అంతేగాని అందరూ ఒకే లాగా మూసపోసినట్టుగా ఉండరు. ఒకరిని చూసి ఒకరు అసూయ పడడం గానీ, బాధపడడం కానీ చేయకూడదని భర్త ఆనంద్ ద్వారా చెప్పిస్తుంది రచయిత్రి.