రైలు పలారం (తెలంగాణ వంటకం)
రచన::మంజులత
ముందుగా కావాల్సిన పదార్ధాలు
-బియ్యం పిండి
-పచ్చికొబ్బర
-పెసరపప్పు
-పచ్చిమిర్చి
-ఉప్పు
-నూనె
-పోపుదినుసులు
-కొత్తిమీర
తయారు చేసే విధానం :
ముందుగా వేడినీటితో బియ్యం పిండిని కలిపి ముద్దగా చేసుకుని బటన్ ఇడ్లీ సైజులో వత్తుకునీ, లేదా చిన్న ఉండ్రాళ్ళ సైజు లో చేసుకునీ, ఇడ్లీ పాత్ర లేక నీటి ఆవిరిపై పది, పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగాలి. ఉండ్రాళ్ళ లాగా చేసుకుంటే అవసరంలేదు. పచ్చి కొబ్బరిని నానపెట్టిన పెసరపప్పును మిరపకాయలు తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక పోపుదినుసులు కరివేపాకు వేసి వేగాక ఈ నూరి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసి పచ్చి వాసన పోయి పొడిపొడిగా అయ్యేదాకా బాగా కలుపుతూ ఉండాలి. ఇది వేగాక మనం తయారు చేసుకున్న బియ్యం పిండి ముక్కలు ఇందులో వేసి అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. కొబ్బరి మిశ్రమం ఈ ముక్కలకు పట్టేదాక కలపాలి. అవసరం అనుకుంటే ఇంకాస్త నూనె వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసిసర్వ్ చేయాలి. వేడివేడిగా తింటే చాలా రుచికరమైన రైలు పలారం ఎంతో బాగుంటుంది.
***