వీడని గ్రహణం
(కథ సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షలు : ఎస్. ఎల్.రాజేష్
కథ: నాకు దెయ్యం పట్టింది
రచన : కార్తీక్ నిమ్మగడ్డ
ఎందరో మహిళల రోజు అనుభవిస్తున్న కన్నీటి వేదనని తాను అన్వయించుకొని కార్తీక్ గారు రచించిన కథ హృదయాల్ని కదిలించింది. ఇది కథ కాదు వాస్తవం. ఆడపడుచుల కన్నీళ్ల అక్షరాలు. మహిళకు మగవాడే కాదు సాటి స్త్రీ కూడా శత్రువు గా ప్రవర్తిస్తున్న తీరు సమాజ పరిస్థితి కి అద్దం పట్టింది. కార్తీక్ గారు సమాజాన్ని, మహిళా జాతి కన్నీటి వెతలను ఎంత సునిశితంగా పరిశీలిస్తున్నారు అనేది అర్థమవుతుంది.
కృతజ్ఞతలు కార్తీక్ గారికి. తరాలు మారుతున్నా మహిళల బ్రతుకులు మరింత కుంగిపోతున్నాయి. అహంకారం అనే దెయ్యం పట్టింది మగ జాతికి. కామం తో కళ్ళు మూసుకు పోయి పసిపిల్లల్ని, పండు ముదుసలి వరకు వదలని చీడ పురుగులు ఉన్న సమాజం లో తాను చేసిన, చూసిన తప్పులు ఆడ జాతి కి అంట గట్టి అడుగు అడుగునా చీదరిస్తూ, అనుమానిస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. కట్టుబాట్లు పేరు తో బానిసల కంటే హీనంగా చూస్తున్నారు. మగవాళ్ళని కట్టడి చేయలేక స్త్రీ జాతి గౌరవాన్ని అణగ దొక్కుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక పుడమిలా కన్నీళ్ళను గుండెల్లో దాచుకుని నిద్ర లేని రాత్రులు గడుపుతున్న దురదృష్టవంతులు ఎందరో. ఎప్పుడో ఒకప్పుడు గుండె అగ్ని పర్వతం అవుతుంది. అసహనం లావాలా తన్నుకొచ్చి సమాజాన్ని రగిలిస్తుంది. నన్ను పుట్టించిన అమ్మ ఆడది అని గుర్తెరిగిన నాడు మహిళ కు నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.