బంగారమే నీవు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: కమల ముక్కు ( కమల’శ్రీ’)
కథ:”బంగారమే నీవు”
రచన: విన్నకోట శ్రీదేవి
కథా సమీక్ష లో భాగంగా విన్నకోట శ్రీదేవి గారు రాసిన మనసే బంగారమాయెనే కథకు నా సమీక్ష.
సహజ అనే ఓ మధ్యతరగతి గృహిణికి ఎప్పటి నుంచో కోరిక మామిడి పిందెల నెక్లెస్ మెడలో వేసుకోవాలి అని. పెళ్లికి ముందు తండ్రి తీర్చని కోరిక కనీసం భర్త అయినా తీరుస్తాడు అనే ఆశతో ఉండేది. కానీ ఆమె ఆశ పెళ్లై పదేళ్లై ఓ పాపా, బాబూ పుట్టినా తీరనే లేదు. కానీ ఆమెలో మాత్రం దాన్ని ధరించాలి అన్న కోరిక తీరలేదు. దానికోసం దాచుకున్న డబ్బులు అత్తయ్యా, మామయ్యా మందుల ఖర్ఛులకో లేక ఏదైనా అత్యవసర ఖర్చులకో అయిపోయేవి కానీ ఆ నెక్లెస్ మాత్రం కొనే అవకాశమే చిక్కలేదు. ఆమె మనసులోని మాట గ్రహించినట్టు నీకెప్పటికైనా నెక్లెస్ కొంటాను అని వాగ్దానం చేసి అన్నట్టుగానే ఆఫీస్ లో లోను వాడి డబ్బులు సమకూర్చుతాడు సహజ భర్త రాజారాం.
అత్త గారు అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిదని చెప్పడంతో ఆ రోజున వెళ్లి కొనే నెక్లెస్ కోసం ఎన్నో కలలు కంటుంది. తులం ఎంత, ఎన్ని తులాలు పడుతుంది నెక్లెస్ కి అని నెట్ లో ఎంక్వైరీ కూడా చేసుకుంటుంది. సరిగ్గా కొనడానికి వెళ్లాలని అనుకున్న రోజు సహజ కూతురు అక్షయ స్నేహితురాలు వర్ష వాళ్లమ్మ దమయంతి కాన్సర్ అని తెలియడం వాళ్లింటికి వెళ్లి ఆమె స్థితి చూడటం జరుగుతుంది. తాగుబోతైన భర్త దమయంతిని పట్టించుకోక పోవడంతో ముగ్గురు పిల్లలను స్పిన్నింగ్ మిల్లు లో పనిచేస్తూ పోషిస్తున్న ఆమెకి కాన్సర్ అని తెలీడంతో ఏమి చేయలేని స్థితిలో భోరున విలపిస్తుంది. ఆమె స్థితి చూసిన సహజ కి మనసు పాడైపోయింది. తను ఎంతగానో ఆశపడి కొనుక్కోవాలి అనుకున్న మామిడి పిందెల నెక్లెస్ కోసం సమకూర్చిన డబ్బులను ఆమె ఆపరేషన్ కోసం వినియోగించి, ఆమె ముగ్గురు పిల్లలను తనింట్లోనే ఉంచి చదివిస్తూ బంగారం కంటే తన మనసు బంగారం అని నిరూపించుకుంటుంది కథానాయిక సహజ. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఏ నూటికో కోటికో ఒకరు ఉంటారు. అలా ఉండేవాళ్లుండ బట్టే దమయంతి లాంటి వాళ్లు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులనుంచి బయట పడగలుగు తున్నారు.
కథ ఆధ్యంతం ఆశక్తి కరంగా సాగుతుంది.