అమ్మ మనసు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : కందర్ప మూర్తి
దేవుడమ్మ , దేవయ్యలకు పదేళ్ల కొడుకు శివయ్య , ఆరేళ్ల కూతురు సుమతి ఉన్నారు. వారుండే గ్రామం వెనుకబడిన పల్లె ప్రాంతమైనందున అక్షర జ్ఞానం తక్కువ. మూఢ నమ్మకాలు ఎక్కువ. ఊరిలో ఎవరికైనా ఎంత పెద్ద జబ్బు చేసినా నాటు వైద్యుడు మీద ఆధార పడతారు. అందువల్ల సరైన వైద్యం అందక అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవ సమయంలో శిశు మరణాలు పోషక లోపంతో పిల్లల చావులు జరుగుతున్నాయి. కూతురు సుమతికి నాలుగేళ్ల వయసులోపోలియో సోకి రెండు కాళ్లు చచ్చు పడిపోయాయి. బీదరికం నిరక్షరాస్యత కారణంగా దేవయ్య దేవుడమ్మలకు ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. నాటు వైద్యుడి ద్వారా తైలాలు పసర్లు వాడినా ప్రయోజనం లేకపోయింది. కూతురి దీనావస్థను చూసి తల్లి మనసు తల్లడిల్లుతోంది. దేవయ్య కు కూడా కూతురికి ఎలా వైద్యం చెయ్యాలా అని దిగులుగా ఉన్నాడు. పట్నానికి తీసుకు పోదామంటే డబ్బులు లేవని బాధపడసాగాడు. ఒకరోజు పక్క ఊరి ఎలిమెంటరీ స్కూల్ టీచరు ఆ గ్రామం వెంట వెళుతు పోలియో వ్యాధితో బాధపడుతున్న సుమతిని ఆమెను వీపు మీద మోస్తున్న దేవుడమ్మను చూసి జాలిపడి పట్నంలో పోలియో జబ్బుతో బాధ పడుతున్న, పిల్లలకు ప్రభుత్వ హాస్పత్రిలో తిండి వసతితో పాటు ఉచిత వైద్యం పరికరాలు ఇస్తారని వివరాలు కాగితం మీద రాసి వెంటనే వెళ్లమని కొంత డబ్బు సాయంచేసాడు. దేవుడమ్మకు కొండంత దైర్యం కలిగింది. కూతురు అందరి పిల్లల్లా ఆడుకోవాలని ఆశ పడింది. ఇంటి దగ్గరున్న మేకను సంతలో అమ్మి కొంత డబ్బు సమకూర్చి కొడుకును మొగుడికి అప్పగించి స్కూలు మాస్టారు ఇచ్చిన అడ్రసుకు కూతురు సుమతిని తీసుకుని బయలు దేరింది. దేవుడమ్మ ఉన్న ఊరు తప్ప పట్నం వైపు వెళ్లింది లేదు. ఐనా కూతుర్ని డాక్టరుకి చూపించి బాగు చేయించాలన్న పట్టుదలతో బయలు దేరింది.
పట్నంలో బస్సు దిగి కూతుర్ని భుజం మీద ఎక్కించుకుని నెత్తి మీద బట్టల మూటతో చేతిలో మాస్టారు ఇచ్చిన కాగితం పట్టుకుని కనబడిన వారికి
చూపిస్తూ హాస్పిటల్ కి ఎలా పోవాలో అడుగుతోంది.
ఉరుకుల పరుగుల పట్నం జీవితంలో ఎవరి తొందర వారిది. ఎవరూ దేవుడమ్మను పట్టించుకోడం లేదు. దేవుడమ్మ దీక్షను ఆరాటాన్ని దేవుడుకనికరించాడు.
అటుగా వెల్తున్న ఒక సామాజిక సేవ సంస్థ వారు దేవుడమ్మ దీనావస్థను సుమతి పోలియో వ్యాధిని గుర్తించి తమ వాహనంలో ఇద్దర్నీ ఎక్కించి ప్రభుత్వ పోలియో సెంటర్ కు తీసుకెళ్లి దగ్గరుండి పేరు రిజిస్టర్ చేయించి. తిండి వసతి ఏర్పాటు చేయించారు. సుమతికి ఆపరేషను చేసి నడక ప్రాక్టీసు చేయించగా ఆరు నెలల్లో చేతి కర్రతో నడవ గలిగే స్తాయికి వచ్చింది. ఊరి నుంచి దేవయ్య వచ్చి భార్యను కూతుర్ని చూసి వెల్తున్నాడు. కూతురిలో వచ్చిన మార్పుకు అందరి పిల్లల్లా కాళ్లు సరైనందుకు మురిసిపోయింది దేవుడమ్మ.
అమ్మ మనసు ఎప్పుడూ పిల్లల మీదే ఉంటుంది. వారి బాగే కోరుకుంటుంది.