జవాబు ఏది?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : ఎస్ ఎల్ రాజేష్
ఏమైపోతుంది సభ్య సమాజం
కనుమరుగవుతోంది మానవత్వం.
శవాలను పీక్కుతినే రాబందులేవీ?
నాయకులుగా మారి బ్రతికినవారిని
ఛిద్రం చేస్తున్నాయి.
కుల కుంపట్లలో చలి కాగుతున్నాయి.
మతాల ముసుగు తొడుగుల్లో
గుంటనక్కలై స్వైర విహారం చేస్తున్నాయి.
ఒంటి నిండా మాదక ద్రవ్యాలు నింపుకుని
కళ్ళ నిండా కామం పొరలు కప్పుకుని
వావి వరసలు కానరాక వయసుతో
సంబంధం లేక అత్యాచారాలు చేస్తుంటే
ఎవరిని నిందించాలి ఏమని ప్రశ్నించాలి.
ఇందుకేనా స్వాతంత్య్రం కోసం
నాటి తరం ప్రాణాలు అర్పించింది.
ఎక్కడ నా స్వేచ్ఛ అని
జాతీయ పతాకం అడుగుతుంది
జవాబు చెప్పేనాధుడెక్కడ?