అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
మధుర స్మృతులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
బాల్యంలో నాలుగిళ్ళ లోగిలిలో అమ్మ ఆకాశంలో పౌర్ణమి చంద్రుని చూపించి వెండిగిన్నెలో గోరుముద్దలు తినిపిస్తు చందమామ రావే జాబిల్లి రావే అన్న పాట ఇప్పుడు మనవడికి చరవాణితో ఐదో అంతస్తు బాల్కనీలో తినిపిస్తున్న కోడలుని చూసి నా చిన్నప్పటి మధుర జ్ఞాపకం గుర్తుకొచ్చి మాతృమూర్తి జ్ఞప్తికొచ్చింది…!!
పాఠశాలలో ఆచారి మాస్టారు నేను బడిమాని టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినపుడు పిలచి చేసిన హితబోధ కృష్ణపరమాత్మ అర్జునుని కి చెప్పిన భగవద్గీత తో సమానమై నా నైతిక ఉన్నతికి కారణమన్నది జీవితాన మరువలేని జ్ఞాపకం……!!
వివాహమై ఇంటిపేరు మార్చుకుని నాతో నలుబది సంవత్సరములు కాపురం చేసి కంటికి రెప్పలా చూసుకొన్న ధర్మపత్ని శ్రీరామచంద్రుని కడకు వెళ్ళినా ఆమె సపర్యలు ఆత్మీయత, అనురాగాలు జీవితాన మరువలేని జ్ఞాపకాలే..!
జీవితాచరమాంకంలో నాన్నగారు ఎలావున్నారు మాత్రలు వేసుకున్నారా భోజనం చేశారా అని ఆప్యాయత గా పిలిచే కొడుకు, మాస్టారు మీ వల్లే ఉన్నతి స్థితిలో ఉన్నాము అని హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకొని వచ్చే విద్యార్థులు ఎన్నో ఎన్నెన్నో మధురమైన మరపురాని సంఘటనలు నా జీవితాన్ని పరిపూర్ణతకు
కారణాలు.!