(అంశం : “మానవత్వం”)
మనుషుల్లో దేవుడు
రచన: వేముల ప్రేమలత
రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి గుడిసె మొత్తం తడిచిపోయింది.. బయట అంతా బురదగా లోపల అంతా నీళ్ళు .
రెండు రోజులుగా బాబుకు జ్వరంగా ఉంది హాస్పిటల్ కి వెళ్ళాలంటే కూడా వీలు లేకుండా కాలనీల నిండా నీళ్ళే.
నిన్నన్నగా వెళ్ళాడు తాగుబోతు మొగుడు ఎక్కడికెల్లాడో కూడా తెలియదు. పైగా కరెంటు కూడా లేదు. నవారు మంచంపై బాబును పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది లచ్చి..
నిన్నెప్పుడో పులిహోర పొట్లాలు పైనుండి విసిరితే ఒకటి దొరికింది అప్పుడు తిన్నదే.
కళ్ళు మూతలుబడుతున్నయి.
మళ్ళీ వరదకు మంచంపైకి కూడా నీళ్లోచ్చాయి గంటగంటకు పెరుగుతున్న నీటి మట్టం.
బాబును భుజంపై ఎత్తుకుని మంచంపైన నిలబడి గుడిసెలో స్తంభాన్ని పట్టుకుంది. తెల్లవారుజామున
కాస్త వరద నీరు తగ్గింది .
పొద్దున్నే గవర్నమెంటు వారు వచ్చి మోటార్ల తో నీరు తోసేశారు అంతా తడిచిన కూడా బాబు ఒళ్ళు కాలిపోతుంది.
బురదలో బాబుని తీసుకొని పక్కనే ఉన్న ఆటో అన్నను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది. డబ్బులు కట్టండి అప్పుడే చూస్తాము బాబుని అన్నారు
అయ్యా నా దగ్గర ఈ తాళిబొట్టు తప్ప ఏమీ లేదు ఇది తీసుకొని బాబును చూడండి అయ్యా అని వేడుకుంది.
పెద్ద సారు పెర్మిషన్ ఇస్తే ట్రీట్మెంట్ ఇస్తాము అన్నారు అనగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళి రాత్రి తను పడ్డ బాధ చెప్పింది ఎలాగైనా నా బాబును కాపాడండి అని….
డాక్టర్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు .. ఇంకో గంట తర్వాత తీసుకొని వచ్చి వుంటే బాబు మీకు దక్కక పోయి ఉండేవాడు ఇప్పుడు పర్వాలేదు అనగానే డాక్టర్ కాళ్లపై పడి “అయ్యా రాత్రంతా నేను పడ్డ బాధ మర్చిపోలేను నేను మొక్కిన దేవుడు మీ రూపంలో వచ్చారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను” అంటూ కృతజ్ఞతలు చెప్పి బాబు దగ్గరకు వెళ్ళింది.