మార్పు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎన్.లహరి
అనగనగా రామాపురంలో రంగయ్య అనే ఒక ఆసామి ఉండేవాడు. అతనికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. అతడికి కుటుంబం కూడా లేదు ఒంటరిగానే జీవనం సాగించేవాడు. కష్టపడి పైకి రావాలన్న ఆశతో బతికేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి అతడికి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఏమిచేయాలో తెలియక, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆపసోపాలు పడుతూ, రోడ్ల వెంట తిరగడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టుపైన ఒక దెయ్యం కాపురం ఉండేది. అది రంగయ్య యొక్క అవస్థలు చూసి నవ్వుకుంది. నవ్వి తనతో ఎందుకు దిగాలుగా ఉన్నావని ప్రశ్నించింది. నేను ఇప్పటివరకు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాను. ఉన్న దాంట్లో అందరికీ సహాయం చేస్తూనే బతికాను. కానీ, నాకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు, నాకు ఉన్న వాళ్లందర్నీ వదిలి దూరంగా వచ్చానని దెయ్యానికి తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు దెయ్యం అతనితో ఇలా చెప్పసాగింది. నాకు కుటుంబం ఉన్నా , నా జీవితంలో వాళ్ల కోసమే కష్టపడి, చెమటోడ్చి, చివరికి అన్ని వాళ్ళకి ఇచ్చేశాను. నాకంటూ ఏమీ మిగల్చుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్లెవ్వరూ అండగా నిలబడలేదు. కనీసం పరామర్శించనూ లేదు. ఎంత సంపాదించినా, నాకంటూ ఏమి మిగుల్చుకోక అన్నీ నా వాళ్ళకి ఇచ్చేసి నేను, చివరికి అనారోగ్యంతో చనిపోయి, దెయ్యంగా మారిపోయాను. కానీ, నువ్వు నలుగురికి సహాయం చేసి కూడా, వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయరన్న బాధతో ఇక్కడిదాకా వచ్చావు. నా మాట విని ఊర్లోకి వెళ్ళు. నువ్వు చేసిన సహాయం ఎక్కడికీ వెళ్లదు. ఆ దేవుడే మనుష్య రూపంలో వస్తాడు. తప్పకుండా వాళ్ళు నిన్ను ఆదుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ నువ్వు వాళ్లకు సహాయం చేశావు. అందుకే చెప్తున్నా. వాళ్లు తప్పకుండా నిన్ను ఆదుకుంటారనే నమ్మకం నాకు ఉంది అని దెయ్యం తనతో అనగానే మళ్ళీ తాను ఊర్లోకి వచ్చేసాడు. రంగయ్య యొక్క దీనావస్థను చూసి చాలా మంది అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తను తొందరగా కోలుకోవాలని ఎంతోమంది పూజలు కూడా చేశారు. వాళ్ల ప్రార్థనా ఫలితంగా తొందర్లోనే కోలుకొని తన వ్యాపారాన్ని మళ్లీ ఒక మంచి స్థాయికి తీసుకొని వచ్చాడు. అంతేకాదు ఉన్న దాంట్లో తాను తింటూ నలుగురికి సహాయం చేసే మంచి గుణాన్ని అలాగే కొనసాగించాడు.