కనువిప్పు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:వలిపే సత్యనీలిమ
శారదమ్మ, రాఘవయ్య ఇద్దరూ అన్యూన్య దంపతులు. రామాపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు పేరు రఘురామ్. కొడుకును బాగా చదివించాలని పైసా పైసా కూడబెడుతూ ఎలాంటి లోటు లేకుండా కష్టాలను తెలియనీయకుండా చాలా అపురూపంగా పెంచారు. వారి ఆశలకు తగ్గట్టుగానే మంచిగా ఉన్నత చదువులు చదువుకున్నాడు రఘు. అంతలోనే రాఘవయ్య యొక్క అనారోగ్యం పాలుకావడంతో రఘు చదువును మధ్యలోనే ఆపు చేస్తానని చెప్పాడు. అయినా కూడా కొడుకు యొక్క ఇష్టాన్ని వారు వారించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించాలని నచ్చచెప్పారు. అనుకున్నట్లుగానే పట్టణంలో ఉద్యోగం దొరికింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి సంబంధం చూసి వివాహం జరిపించారు రాఘవయ్య శారదమ్మల, కోడలు పూర్ణ చాలా గుణవంతురాలు. పట్టణంలో ఉద్యోగం కాబట్టి అక్కడే కాపురం పెట్టారు. సంవత్సరం కంతా ముత్యాల్లాంటి కవలలు పుట్టారు. పిల్లల ఆలనాపాలనా చూస్తూ వారి ముద్దు ముద్దు మాటలను వింటూ కృష్ణా రామా అని గడపాలని ఆశపడే వారి కోరికలు నెరవేరలేదు. కొడుకు ఎప్పుడు కూడా పల్లెటూరని ఏవీ వసతులు ఉండవని తీసుకువచ్చేవాడేకాదు. భర్త ప్రవర్తన నచ్చని పూర్ణ తన భర్తలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండేది. నెలనెలకు మనియార్డరు రూపంలో డబ్బులు పంపించేవాడు. అయినా కొడుకు కోడలు పిల్లలు దూరంగా ఉంటే ఆ భాధ తగ్గిస్తుందా డబ్బు అని అనుకునేది శారదమ్మ. అయినా అవసరాలు ఉంటాయిగా అని బాధపడేది. రఘు పిల్లలు ఎదురు మాట్లాడడం, చెప్పిన మాట వినకపోవడం, ఇవన్నీ చూసి రఘు బాధపడేవాడు. అప్పుడు పూర్ణ చెప్పింది. “నీవు నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తావో, నీ పట్ల కూడా పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు,” అని ఈ మాట రఘును ఆలోచించేలా చేసింది. రఘు ఆలోచనలో పడేసరికి పూర్ణ తన పథకం ఫలించినందుకు సంతోషించింది.
నీతి: నీవు ఇతరులకు ఏమి ఇస్తావో తిరిగి నీకు అదే దక్కుతుంది.