(అంశం:: “సాధించిన విజయం”)
నేను గెలిచాను
రచన :: దోసపాటి వెంకటరామచంద్రరావు
“అమ్మా!నన్ను దీవించమ్మా!నాకు స్టేట్ బ్యాంకులో ఆఫిసర్ ఉద్యోగం వచ్చింది.ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే.ఇక రేపటినుండి నువ్వు ఆ టైలరింగు మిషన్ తో కుస్తి పట్టనక్కర్లేదు.ఇన్నాళ్ళు నీకు కనపడకుండా వుండడానికి కారణం ఇదే నమ్మా. ఎంత కష్టమైనా సరే ఉద్యోగం సంపాదించిగాని నీ ముందుకు రాదలచుకోలేదు.నన్ను క్షమించు”.
అంటు తల్లి కాళ్ళకి దండం పెడుతూ అన్నాడు రవీంద్ర.
“అయ్యో!వెర్రి బాగులోడా!నేను క్షమించడమేమిట్రా! నువ్వేం తప్పు చేసేవులే.అయినా నాకు ఒక్కమాటైనా చెప్పకుండా వెళ్ళిపోతే నా కెలాగుంటది చెప్పు.నువ్వు నేను మనిద్దరమే కదా.మనకెవరున్నారని.”రవీంద్ర తల్లి ఊరడింపు.
“సరేలే!పద కాళ్ళు చేతులు కడుక్కో.ఎప్పుడు తిన్నావో ఏమిటో?కాస్తంత వేడి వేడి కూడు తిందువుగాని పద.”అంటూ కొడుకుని తొందర పెట్టింది.
****
రవీంద్ర చిన్నప్పటినుండి చాలా చురుకుగా వుండేవాడు.బడిలో పాఠాలు శ్రద్దగా వినేవాడు.అన్నిటిలోను చురుకుగా పాల్గోనే వాడు.కాకపోతే వాడి ఇంటి పరిస్తితే చాలా హృదయవిదారకమైనది.తండ్రి కూలినాలి పనులు చేస్తాడు.సంపాదించింది అతని తాగుడికే సరిపొయేది. తల్లి పెద్దగా చదువుకోలేదుగాని టైలరింగు పనులు చేయగలదు.ఎలాగో కష్టపడి మహిళా సంఘంలోచేరి అక్కడ ఉచితంగా టైలరింగు నేర్పి మిషన్ ఇవ్వడంతో అదే జీవనాధారంగా చేసుకొంది.రవీంద్ర చదువులో చురుకవడంతో రామయ్య మాష్టారు వాడిని ప్రొత్సహిస్తూ ఉండేవారు.వాడికి పుస్తకాలు ఫిజులు కడుతూ పై చదువులకు పంపేశారు. రవీంద్ర తండ్రి తాగి తాగి జబ్బుచేసి చనిపోయాడు. రవీంద్రను ఎట్టి పరిస్థితిలోను చదువు మానకుండా రామయ్య మాష్టారు రవీంద్ర తల్లికి నచ్చ చెప్పారు. ఆమె తన రెక్కలకష్టం తో జీవితం గడపసాగింది. తండ్రి చనిపొయినప్పడు రవీంద్ర వచ్చి చదువు మానేస్థాననడంతో తల్లి రామయ్య మాష్టారు ఇద్దరు అతనికి చదువుమానడానికి వీలు లేదని. మరో రెండునెలలో చదువు పూర్తవుతుందని నచ్చ చెప్పారు.సరేనని తనూ పట్నం వచ్చెశాడు. చదువు పూర్తవగానే ఊరికి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడి తల్లి పరిస్థితి చూసి ఉండలేక ఎలాగైనా కష్టపడి ఉద్యోగం సంపాదించుదామని తల్లికి చెప్పకుండా వెళ్ళీ పోయాడు.అలా వెళ్ళిన వాడు ఇదుగో ఇప్పడు నిజంగానే ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు. మర్నాడు తల్లిని తనతోపాటు పట్నం తీసుకొని వెళ్ళిపోయాడు నేనే గెలిచాననుకొని.
***