నేటి విద్యా వ్యవస్థలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పద్మావతి పి
వ్యాపారంగా మారిన అంగడి చదువులు
ఆకాశంలో చుక్కలనే చూపిస్తున్నాయి
నిరుపేదల ప్రతిభల భవితను కూల్చే విద్యా సంస్థలు
ఒకపూట గుప్పెడు మెతుకులకైనా
నోచని ఆకలి మంటల
దుర్భర దారిద్ర్యాన్ని భరించలేక సామాజిక విద్రోహులుగా వారిని మార్చేస్తున్నాయి
దొంగలుగా, దోపిడీ దారులుగా
బానిసత్వంతో మగ్గిపోతున్నాయ్
చదువులను కొనలేక నిరాశా నిస్పృహలతో
విసిగి వేసారిన సామాన్యులు పెడదారుల్లో నడిచే యువశక్తిని పీల్చి పిప్పి చేస్తున్నాయి.
మూర్ఖపు దారుల్లోకి పయనింప ౙస్తున్నాయి.
సర్కారు బళ్ళంటూ విద్యలే ఉచితమంటూ
చదివే వారికి మధ్యాహ్నం ఉచిత భోజనాలంటూ నిరుపేదల జీవితాలను అక్రమార్కుల
అవినీతుల దందాలకు ముడి వేస్తున్నాయి.
అక్షరానికో లక్ష చెల్లించే కార్పోరేట్ విద్యలు
బడాబాబుల జేబుల్లో పెంచే నోట్లకట్టలు
నాలుగు గోడల మధ్యన విద్యల
అమ్మని బందీగా చేసి
ఆటలు పాటలు మరిచిన పసిమనసులను బొమ్మల్లా మార్చి స్పందన చైతన్యాలనే మరిపించి
జ్ఞానాన్నిఅటకెక్కించిన విద్యాబుద్ధులు.
అర్జనలే తప్ప అభ్యాసములే కొరవైన
వ్యాపార కర్మాగారాలుగా మార్చిన
నేటి అక్కరకు రాని చట్రాల ఉచ్చులు.
అదేమని ప్రశ్నిస్తే?
నిజాలను నిగ్గదీస్తే
ఇజాలకు అంటగట్టి
అతివాదులుగా చిత్రించి
చేతులకు సంకెళ్ళతో
పిచ్చివారుగా మార్చేస్తున్న నేటి విద్యా వ్యవస్థలు.