నాన్నతో నా చివరి జ్ఞాపకం.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : సౌజన్య రామకృష్ణ
29ఏళ్ల క్రితం.. ఆ రోజు గణపతిని నిమర్జనం చేసే రోజు..! “సౌజన్య గణపతిని గట్టిగా పట్టుకున్నావా?? ” అని అడిగారు నాన్న.
“నాన్న పట్టుకున్నాను” అని అన్నాను. మేము గణపతిని నిమర్జనం చేయాలి అని బయలుదేరిన ఐదు నిమిషాలకు చినుకుతో మొదలయ్యిన వాన
కుంభవృష్టిగా మారింది. “సౌజి మనము సముద్రం వరకూ వెళ్లలేము”అన్నారు. నాన్న బండి వేగం తగ్గించి.
“నాన్న అయితే ఎక్కడైనా ఆగుదాం” అన్నాను.
‘ఒక ఇంటి ముందు బండి ఆపారు. ఇద్దరం ఆ ఇంట్లోకి పరుగున వెళ్ళాము. నాన్న ఒళ్ళో నేను.
కాస్త భయంగానే కూర్చున్నాను. అప్పుడు నా వయసు 9 ఏళ్ళు. వర్షం చూసి కంగారు పడుతున్న నాతో.. భయపడకు సౌజి నేను ఉన్నాను అన్నారు.
ఆరోజు వర్షం తగ్గేదాకా అయన వడిలోనే కూర్చోపెట్టుకుని ఎన్నో కబుర్లు చెప్పారు. వర్షం తగ్గాక ఇద్దరం దేవుడిని నిమర్జనం చేసి ఇంటికి వెళ్ళాము.
కానీ నెల తిరిగే సరికి నాన్న నన్నే కాదు అమ్మని, చెల్లిని కూడా వదిలేసి శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు.’
ఇప్పటికి నాకు భయం వేస్తే అదే సంఘటన తలచుకుంటాను. ఆయన నాతోనే ఉన్నారు అనే అనుకుని ముందుకు సాగుతున్నాను.
కానీ ఆ సంఘటన నా జీవితంలో ఒక మరిచిపోని మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోయింది.!
“ఐ మిస్ యూ నాన్న!”
“ఐ లవ్ యూ..!”