ఒక మంచోడి కథ..(అనుకరణ కథ)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : ఎస్.ఎల్. రాజేష్
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్..! 1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష … స్టేట్ ఫస్ట్..!ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే మళ్లీ స్టేట్ ఫస్ట్….!
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు..బ్యాచ్ ఫస్ట్.! అదే ఏడాది ‘GATE’ పరీక్ష…ఫస్ట్ రాంక్..!ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు మళ్లీ ఫస్ట్ ర్యాంక్….!
ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్….! ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచీ పరిచి, గ్రీన్ కార్డు వీసాఇచ్చి, పచ్చజెండాఊపిమరీ మామెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోచేరమని సీటు ఇచ్చింది!
మరి….మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే! మనవాడు మాత్రం ‘నా చదువుకు నా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది., ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! ప్రజల డబ్బంటే పేదల చెమట,వాళ్ల రక్తం.. వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులే తనను చదివించాయి!’
‘అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి’ అనుకున్నాడు.
ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.
చిన్నప్పటినుంచీ నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన… వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.
అతని పేరే-రాజు నారాయణ స్వామి!కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు. అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి. ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది! ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.
ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. “నా అల్లుడు కలెక్టర్…, నన్నేం చేయలేరు” అనుకున్నాడు. మన కలెక్టర్ గారు ఆభవనాన్ని కూల్చి వేయించారు. కోపంతో మామభగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలివెళ్లిపోయింది.
ఆ తరువాత రాజునారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు. కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు. అంతే .! మళ్లీ ట్రాన్స్ ఫర్.. మళ్లీ కొత్త ఊరు..కొత్త పని..!
కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం,బిల్లులు వసూలుచేసుకోవడం ఆ తరువాత వానలు పడటం., వానకి గట్టు కొట్టుకుపోవడం, మళ్లీ టెండర్లు.. పనులు.. మళ్లీ బిల్లులు.. మళ్లీ వానలు…ఇదే తంతు కొనసాగేది.
రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. ‘వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది ‘ అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.
మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. అంతే..! మళ్లీ పాత కథ పునరావృతం అయింది. చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ ముఖ్యమంత్రి రాజునారాయణస్వామిని ఎలాంటి ప్రాధాన్యతాలేని ఓ విభాగంలో పారేశారు.
చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ‘ఐక్యరాజ్య సమితి’ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. ‘మాదగ్గర పనిచేయండి’ అని కోరుతూ పిలువు వచ్చింది.
ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ వెళ్లిపోవడానికిసిద్ధమయ్యాడు!
రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు.ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.
వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు ‘సాహిత్య అకాడమీ’ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు. కానీ నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.
రాజు నారాయణ స్వామి… ఈ ఘనతవహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలి పోయాడు అని వ్రాయడం సబబేనా?
కానీ కొన్ని కొన్ని జాడ్యాలు దేశాన్ని వదలాలంటే.. కొందరి చరిత్రలు అలా ఒక చరిత్రగా మిగులకూడదు… ! అందుకే రాజు నారాయణస్వామి గారిది ఫెయిల్యూర్ స్టోరీ కాకూడదు. మనకు కనువిప్పు కావాలి.
ఇది వాట్సాప్ లో వచ్చిన కథ. వాస్తవ రూపం. దీన్ని అనుకరణ చేయడమైనది.