అంశం: ప్రేమలేఖ
ప్రేమానుభూతి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కందర్పమూర్తి
“ప్రేమ” అనేది ఒక అనుభూతి. అటువంటి ప్రేమ ఇద్దరు వ్యక్తుల మద్య కావచ్చు ఆప్తుల మద్య కావచ్చు లేదా జంతువులు పక్షులు దేనితోనైన జరగవచ్చు. పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు అమ్మనాన్నలతో తర్వాత తోబుట్టువులతో ఆ పైన స్నేహితులతో యవ్వనంలో సాటి వయసు వారు వివాహమైన తర్వాత కట్టుకున్న భార్యతో ప్రేమానుభూతి కలుగుతుంది. అటుపైన వాత్సల్యం అనే ప్రేమానుభూతి సంభవిస్తుంది. సాధారణంగా యవ్వనంలో యువతీ యువకుల మద్య సంభవించే వయసు ప్రభావ అనుభూతినే ‘ప్రేమ’ అనే పదంతో వాడుకలోకి వస్తోంది. ఇద్దరు స్త్రీ పురుషుల మద్య కలిగిన ప్రేమనే అనుభూతి ఉత్తరాల ద్వారా పాటల ద్వారా సంకేతాల ద్వారా వ్యక్త పరుచుకుంటారు. పురాణ కాలంలో పక్షులు జంతువులు మేఘాలు ఇలా ఏది సాద్యమైతే ఆ మాద్యమం ద్వారా తమ ప్రేమానుభూతుల్ని పంచుకునే వారు. దుష్యంతుడు-శకుంతల, శంతనుడు-గంగ వంటి పురాణ పురుషుల ప్రేమ సందేశాలు సఫలమైతే తర్వాత తరంలో లైలా- మజ్ను, దేవదాసు- పార్వతి , వీర్-రాంఝా, మల్లీశ్వరి-తోటరాముడు వంటి భగ్న ప్రేమికుల కథలు వింటున్నాము. ఆధునిక యుగంలో ప్రేమ పరిభాషే మారిపోయింది. వయసుతో సంభవించే ఒక తాత్కాలిక మోహావేశాన్ని ప్రేమ పేరుతో వాడులోకి తెచ్చారు నవతరం యువత.
దానికి రకరకాల పేర్లు జోడించి లేఖల ద్వారా ప్రేమానుభూతుల్ని వాడుకుంటున్నారు. ఆ మోహావేశం చల్లబడిన తర్వాత ఎవరి దారి వారిది. ఆ ప్రేమకు స్థిరమైన పునాది ఉండటం లేదు. అశ్లీల సాహిత్యం, అశ్లీల దృశ్యాలు, ప్రసార మాద్యమాల వల్ల యవ్వనంలో ఉండే యువతీ యువకులు ఆకర్షణకు లోనై అదే ప్రేమనే భ్రమలో కాలం గడుపుతున్నారు. నిజమైన ప్రేమ తాత్కాలితం కాదు. అది మెల్ల మెల్లగా చిగురించి విస్తరిస్తుంది. చిరకాలం నిలిచి ఉంటుంది. మన భారతీయ సంప్రదాయంలో స్త్రీ-పురుషుల్ని వివాహమనే బంధంతో ముడి వేస్తే ఆ అనుబంధం వారి జీవితాంతం చిరస్థాయిగా మిగిలి ఉంటోంది.