సహనంతో..మూడు ముళ్ళు
రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి
నాలుగేళ్ళుగా నలిగిన మనసుకు
నేడిలా ఊరట దొరికె
అభిప్రాయాలనిచ్చిపుచ్చుకున్న గాని
మనసు విప్పి చెప్పుకుంటె ఏమి
రెప్పపాటు కాలాన తీసుకునే
పైపెచ్చు తీసుకోగలిగే
నిర్ణయాలు ఎగిరిపోయేవీ
మరు రెప్పపాటు కాలంలోనే
గాలిలోన తేలు మనసల్లే
గాలికబుర్లూ చేతలు
చేసి ఏమి సాధించేమని
పెద్దలంగీకారానికై
ప్రేమను వృద్ధి చేసుకుంటూ
ప్రేమైక జీవన గమనానికి
పట్టిన ఆ ఓర్పుకు
ఆసన్నమాయె తుదకు
తాంబూలాల శుభఘడియ
కతికితే అతకదనుదానికి కట్టుబడి
ఇచ్చిపుచ్చుకోవడాలు
ఇటునటు పెద్దలు చూసుకోగ
నిశ్చితార్థ నిమిషం
ఆమె మనసు తేలికాయె
అతనిలోన కొంటెతనం తొంగిచూసె
సైగకే తెలియని సైగచేసి
పెరడు చూచు ఒక సాకుతోడ
గిలిగింతరేపు క్రియకై
ఆ ముగ్ధ “మనోహరి””మనో”హరుడు వెళ్ళిరాగా
పోయివచ్చెదమంటు మగపెళ్ళివారు లేవ
పంపుకుని పెద్దలిక సద్దుడులోన దిగ
ముగ్ధత్వంతో వాకిటతలుపులు మూసివేయజాలనంటూ
సందు మలుపు వరకూ-తన కనుసన్నలకందువరకూ
అప్రమేయంగా ప్రవేశించిన సిగ్గుతో
ఒక తలుపుకు మరు తలుపు గొళ్ళెం పెట్టలేనంత
కళ్ళాలు దాటిన తహ తహ
మెట్టినింటికి ఎపుడేగుతానా అని
పైటపైన మెడలోన గొలుసు స్థానే
ఎదపైని సూత్రాల బంగరు భవితకు ఆహ్వానం