ఆ దరికి చేరుకో…!
రచన:చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)
ఆశా ఎండమావుల ఎరతో
రగిలే నిప్పుకణిక చల్లారిపోయింది…..
మేఘాలకు తాడుకట్టి సొంతం చేస్తే
కసాయి గొర్రెలై ఆ తాడుని పట్టుకు వేలాడుతున్నాయి..
గ్రహాంతర వాసుల్తో సావాసం చేయిస్తామంటే
ఆ మాటకే ప్రాణవాయువుని దానం చేసిన అమాయకత్వం…..
కుడిచేత్తో కాసులు కురిపించి ఎడమచేత్తో
వరహాలు లాక్కుంటున్నా గుంపులో గోవిందలై
చోద్యం చూస్తున్న వైనం….
పైకి పేదరికపు నక్క జిత్తులు
లోన ధన ప్రవాహ పంపకాలు జరుగుతున్నా
మౌనం వీడలేని మేథావి వర్గమది…..
తెల్ల కాగితాలతో సంసారం
నీలి కలాలతో కాపురాలు చేస్తున్న
ఎర్ర గుండెలు సైతం
ఏ రంగును పులుముకోవాలో
ఏ రంగైతే జీవితాలకు పెన్నిదౌవుతుందో
ఏ మాటలు నీటి మూటలో
ఏ వాగ్ధానాలు వెండి కొండలో
ఏ చేతలు ఎండమావులో
తెలుసుకోలేక తల్లడిల్లుతున్నాయి….
ఉద్యమ పతాకాలు చేతబట్టి తిరిగినా
ఎందుకో ధైర్యం దాగుడుమూతలాడుతూ ఉంది
ఒక్కసారి పిడికిలి బిగించి ముందడుగేస్తే
ఎదిరి ఎవరైనా మోకరిల్లక తప్పదు
ఎండమావి నీ దరికి రాదు నీవే ఆ దరికి చేరుకో..!
***