ఒక ఊరిలో ఒక రాజు. రాజ్యానికి రాజైనా మనశ్శాంతి కరువై, ఎప్పుడూ ఏదో ఒక దీర్ఘాలోచనలో ఉండేవాడు. ఇదంతా గమనించిన మంత్రి పలురకాల వైద్య నిపుణుల్ని పిలిపించి రాజుని క్షుణ్నంగా వైద్య పరీక్షలు చేయిస్తాడు. వైద్యులు పరీక్షించి పెద్ద జబ్బు అంటూ ఏమీ లేదని తేల్చిచెప్తారు. తెలివైన మంత్రి గమనించి ఇలా అయితే మా రాజు రోజురోజుకు క్షీణించి ఆరోగ్యం దెబ్బతింటుందని ఆలోచించి, ఉపాయం పన్నుతాడు. ఊర్లో ఉన్న ఒక సాధువుని తీసుకువస్తాడు. రాజుగారు మీకు అభ్యంతరం లేకపోతే ఈ సాధువు చెప్పేది ఒకసారి వినండి,తర్వాత పరిష్కారం మీకే దొరుకుతుంది అంటాడు. రాజు సరే అలాగే పిలిపించు అనగా ,రాజు ఆజ్ఞమేరకు సాధువు వస్తాడు .రాజు ను పరిశీలించి అయ్యా మహానుభావులు, మీకు ఏ విధమైన జబ్బులేదు .నా మాట గా ఒక పరిష్కారం చెబుతాను. మీరు అన్యధా భావించకుంటే ,మీరు తప్పుగా తీసుకొనంటే చెప్తాను అని అంటాడు. దానికి రాజు చేసేదేమీలేక ఎంతో ఖర్చు పెట్టి వైద్యులతో కానిది ఇతని వల్ల అవుతుంది అనడం ఒకవైపు నమ్మశక్యంగా లేకున్నా ,మంత్రి అంతగా చెప్తున్నాడు తన ఆరోగ్యం అశ్రద్ధ చేస్తే తనకు ముప్పు అని తెలుసుకుని, సాధువును పరిష్కారం చెప్పమంటాడు. ఏం లేదు మహారాజా అత్యంత సంతోషంగా ఉన్న వారి “చెప్పులు” మీరు ధరించాలి, అంతే అంటాడు. అత్యంత సంతోషకరమైన వ్యక్తులు ఎవరున్నారో, గాలం వేసి పట్టుకొనిరండి అంటూ రాజు ఆదేశిస్తాడు. అదేవిధంగా రాజు కొలువులోకి ఆ వ్యక్తిని తీసుకువస్తారు. అతనొక బిచ్చగాడు. రాజు వెంటనే నీ చెప్పులు నాకు ఇవ్వు నీకు ఎంత ధనమైన ఇస్తాను,అని చెప్పగా ఆ బిచ్చగాడు మహారాజా క్షమించాలి నాకు చెప్పులు కూడా లేవు .ఎందుకలాగా అని రాజు ప్రశ్నించగా, ఏముంది దొరగారు చెప్పులు ఉంటే అవి ఎక్కడ పోతాయన్న ధ్యాసతో నా సంతోషాన్ని కోల్పోతాను .కడుపుకు తిండి ,కంటికి నిద్ర తప్ప నాకు విలువైన వస్తువులు ఏమీ లేవు ,ఒకవేళ ఉన్నా నేనింత సంతోషాన్ని పొందను అని సెలవిస్తాడు. రాజు ఒక్కసారి అతని మాటలకు తన్ను తానే మర్చిపోతాడు.
” ఓసి నీ ఇల్లు బంగారం గాను” ఇదా నీ రహస్యం అంటూ తన పొరపచ్చాలను వీడి, తన పిసినారితనాన్ని వదిలి ఆ బిచ్చగాడిని ధనధాన్యాలను కానుకగా ఇచ్చి అబ్బురపరుస్తాడు. రాజు తనను తాను తెలుసుకొని ప్రజలందరికీ తన వంతు సహాయ సహకారాలను అందించి ఆదుకోవడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడా దొరకదని గ్రహిస్తాడు.
నీతి:
ఆనందం, మనశ్శాంతి మనలోని నిధులే వాటిని తెలుసుకుని ఉపయోగించడంలోనే ఆనందం ఉంటుంది.
***