దీపం జ్యోతి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధవి బైటారు”దేవి తనయ
“నానమ్మ.. నానమ్మ.. చూశావా! నా పుట్టిన రోజు కోసం నాన్న ఎన్ని కొన్నారో” అని సంబరపడిపోతు లోపలికి వచ్చింది. ఎనిమిదేళ్ళ సంహిత. “ఏం కొన్నారమ్మా” అని నవ్వుతూ ప్రశ్నించింది వర్ధనమ్మ.
“ఇదిగో చూడు” అంటూ హడావిడిగా షాపింగ్ మాల్ నుండి తెచ్చిన కవర్ నుండి అందమైన గులాబీరంగు గౌను బయటికి తీసి వర్ధనమ్మకి చూపించింది. ఆ గౌనుని చేతిలోకి తీసుకుని చూస్తూ “చాలా బాగుంది. నా బుజ్జి తల్లి ఈ గౌనులో బుట్టబొమ్మలాగా ఎంత బాగుంటుందో” అని సంహిత బుగ్గలు పుణికింది. “ఇదిగో చాకొలెట్స్ కొన్నారు. ఇంకా హెయిర్ క్లిప్స్, గాజులు, పెన్నులు కూడా కొన్నారు” అని ఒక్కొక్కటి తీసి చూపిస్తూ
“ఇది చూశావా నానమ్మా.. ఎంత బాగుందో! దీనిని కేక్ మీద పెట్టి వెలిగిస్తే మ్యూజిక్ వచ్చి ఓపెన్ అవుతుందట. అప్పుడు నేను దానిని ఆర్పేసి కేక్ కట్ చెయ్యడమే” అని చప్పట్లు కొడుతూ గొప్పగా చెపుతున్న సంహితతో ఏమి అనకుండా ఊరుకుంది వర్ధనమ్మ. రాత్రి భోజనాలయ్యాక వర్ధనమ్మ పక్కన పడుకుని “ఇందాక నేను ఆ కొత్త లైట్ ని చూపిస్తే ఏం అనలేదు. ఎందుకు నానమ్మా?” అని సందేహంగా అడిగింది సంహిత. “మనది దీపాలు వెలిగించే సంస్కృతి అమ్మా. దీపం పరం జ్యోతి స్వరూపం. చీకట్లను పారద్రోలి వెలుగులును ఇచ్చే దీపాలను ఎప్పుడూ వెలిగించాలి కానీ ఆర్పకూడదు. కానీ విదేశీ సంస్కృతి మోజులో పుట్టినరోజుల నాడు దీపాలను ఆర్పుతున్నారు. నాకు అది ఇష్టం లేక ఊరుకున్నాను” అని వర్ధనమ్మ అనగానే “ నా పుట్టిన రోజు నాడు దేవుడి గదిలో దీపాలు వెలిగిస్తాను. సాయంత్రం ఆ కొత్త దీపాన్ని వెలిగించినా ఆర్పను. సరేనా నానమ్మ” అని అనగానే “నా బంగారు తల్లి” అని మురిసిపోతు సంహితని దగ్గరకి తీసుకుంది వర్ధనమ్మ.