మనసు పలికే
రచయిత: యం. సుశీల రమేష్
కవిత రాద్దామని గోదారి గట్టు మీద కూర్చుంటే ,
పిల్ల గాలి నా కొంగు పట్టుకొని పరిగెడుతుంటే ,
నేను కొంగు కోసం పడే పాట్లు చూసిన,
గండుకోయిల మరింత తియ్యగా కూయసాగింది.
తీయని కోయిల రాగానికి నేను
మైమరిచిన వేళ,
కొంటె వాన నిలువెల్ల నన్ను తడిమింది.
తడిసిన మేను వెచ్చదనానికి వెతుకుతుండగా,
తుంటరి తుమ్మెద లాంటి నా సఖుడు, అల్లుకుపోయి,
నా అణువణువూ తాకిన తన పెదాల ఒరవడి తో,
మరింత బిగించిన బిగి కౌగిలిలో బందీ అయ్యాను.
తన వెచ్చని ఉచ్వాస లో కర్పూరంలా కరిగిపోయాను.