మరో లోకం
రచన -యర్రాబత్తిన మునీంద్ర( చైత్రశ్రీ)
కనుమరుగయినట్లే అయి
రావణాసురుని తలల్లా మళ్ళీ పుట్టుకొస్తూ
సెకండ్ వేవంటూ సెకండుకో ప్రాణాన్ని సేకరించింది..
కరోనా ఓ మహమ్మారా..
లేక ప్రాణాలను సేకరించి మరో లోకంలో
మొలకెత్తించే నూతన లోక నిర్మాతా?
అందుకేనేమో ఇన్ని ఆయువుల ఆవగిస్తూ
కరోనీయులుగా పునర్జన్మ ప్రసాదిస్తున్నట్లుంది….
ఏమో? నిజమేనేమో? ఆ లోకం….
మణి మాణిక్యాలతో పొదగబడిన నిశ్చల స్తంభాలపై
పరపరాగ రేణువుల పుప్పొడి సువాసనల నడుమ
రంభ ఊర్వశి మేనకాది అప్సరసల నృత్యాలతో
కోరిన కోర్కెను తీర్చే అక్షయపాత్రల సహవాసంలో
అమృతపు దారలతో స్నానపానాదులు ఆచరిస్తూ
ప్రకృతిని ఆస్వాదిస్తూ అంతరాలంలో విహరింపజేసే అద్భుత తరంగ ఉల్లాసభరిత లోకమేమో ?
ఎవరికి ఎరుక ..ఆకాంక్షించుట తప్పు కాదు..
ఆ సుమసుందర లోకంలో నివశించే భాగ్యం కల్గిన
కరోనీయులకు మృత్యువే వరమైందని
కడు సంతోషంతో హృదయాన్ని శాంత పరుచుకున్నా
లేకపోతే నా గుండె కూడా గబుక్కున ఆగిపోదూ..!
ఎందుకంటే కరోనీయులు నా బంధుమిత్ర సందోహం…!