అంశం : నిశి రాతిరి
నిశాచరులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి కోవూరు
మసి పూసిన మారేడు కాయలా
మసకబారిన మబ్బుల నిశీధిలో,
కారు వర్ణముల తానమాడి తరచి తరచి చూస్తు,
తాళమున్న గృహాల చేరి
పరుల రెక్కల కష్టం అప్పనంగా అందుకొన
సన్నద్ధమయ్యిరి చోర శిఖామణులు.
పండుగ సంబరాల మునిగి తేలి,
పిల్లల పాపలతో సంతోషాల,
నవ్వుల జిలుగులతో హాయిగా,
కులాసాగా గూటికి చేరు వారికి తెలియదు,
నిశీధి వేళ మత్తుకు బానిసై,
కన్నుమిన్ను గానని మృత్యు శకటాలు
ఎన్నో తిరుగాడుతుంటాయని,
ఎన్నో పచ్చని కుటుంబాలను
తమ కర్కశ పాద ఘాతముతో
చిదిమి శోకసంద్రాన ముంచేస్తాయని.
మసకబారిన మబ్బుల నిశీధిలో,
నిశాచరుల చైతన్యానికి ఊతమివ్వగా,
మానవరూప జంబూకాలు,
రాబందు చూపుల తూపులతో పయనమై,
అణువణువు జల్లించి పంజా విసురుటకు
సిద్ధంగా పొంచి ఉన్న మానవ మృగాల గాంచి,
భీతిల్లిన చూపులతో గుండెల్లో దడదడలాడగ గడగడ వణుకుచుండె
లోకం తెలియని పసి లేడికూన ఆ నిండు నిశిరాత్రి.