రక్తదానం – ఆవశ్యకత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : కందర్ప మూర్తి
ఉరుకుల పరుగుల నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి ఆర్థిక శారీరక మానసిక వత్తిడితో సతమతమవుతున్నాడు. ఆరోగ్య పరంగా శారీరక రుగ్మతలు ప్రమాదాలతో కష్టాల పాలవుతున్నాడు.పుట్టిన బిడ్డ నుంచి వయో వృద్దుల వరకు అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఎంత కొత్త వాహనమైనా ఇంధనం (ఫ్యూయల్ ) లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు కదల లేనట్టే మనిషి శరీరంలో రక్తం(బ్లడ్) అనే జీవపదార్ధం ప్రహించక పోతే జీవితం లేదు. మనిషికి ఊపిరి (ప్రాణవాయువు) ఎంత అవుసరమో బ్లడ్ కూడా అంతే ముఖ్యం.
మనిషి ప్రాణాలతో దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవుసరమవుతుంది.రక్తం అంటే విలువ కట్టలేనిది. ప్రాణాపాయంలో సంజీవని వంటిది. ప్రమాదాలు జరిగినప్పుడు , శస్త్రచికిత్సలు , స్త్రీల ప్రసవ సమయంలో, శరీరం కాలిన గాయాలపుడు , కొన్ని దీర్ఘ రోగాలు, పిల్లల థలాసీమియా లుకేమియా సికిల్ సెల్ ఎనీమియా, వృద్దుల మూత్ర పిండాల డయాలసిస్ గుండెజబ్బుల ఆపరేషన్ సమయాల్లో బ్లడ్ దాని ఉపపదార్దాలు(కాంపొనెంట్స్) అవుసరమవుతాయి.
దానా లన్నిటిలో రక్తదానం కూడా గొప్పది. రక్తం అనే జీవ పదార్థం ఎటువంటి కర్మాగారాలలో తయారు చేయలేనిది.మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి రక్తం డొనేషన్ చెయ్వాల్సి ఉంటుంది. ఒక మనిషి చేసిన రక్తదానం వల్ల నలుగురు పేషెంట్ల ప్రాణాలను కాపాడవచ్చు. ఆరోగ్య వంతుడైన మనిషి శరీరంలో 5 లేక 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అందులోంచి 350 మిల్లీ లీటర్ల బ్లడ్ సంవత్సరంలో మూడు లేక నాలుగు నెలల కొకసారి డొనేట్ చెయ్యవచ్చు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. రక్త ద్రవ పదార్థంలో ఎర్ర రక్తకణాలతో పాటు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు ఉంటాయి. ఇవి కాక ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం వంటి మూలకాలతో పాటు ఆక్సిజన్ , నైట్రోజన్ కార్బన్డయాక్సైడ్ వంటి వాయువులు హార్మోన్లు సమ్మిళితమై ఉంటాయి. ఎర్ర రక్త కణాలు (Red-blood cells) శరీర భాగాలకు ఆక్సిజన్ తో పాటు ప్రోటీన్లు ఫేట్స్ కార్బొహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్ సాల్ట్స్ వంటి పోషక పదార్థాలు అందచేస్తాయి. తెల్ల రక్త కణాలు( White blood cells )శరీర రోగ నిరోధక శక్తిని పెంచి రోకీటాణువుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ప్లేట్ లెట్స్( Platelets ) శరీరంలో రక్తస్రావం (bleeding) జరిగినప్పుడు రక్తకణాలు గడ్డకట్టి రక్త స్రావం నిలుపుదల చేస్తాయి. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలలో హెమోగ్లోబిన్ అనే ఇరన్ మూలకం ముఖ్యమైంది.
దీని వల్ల రక్తానికి ఎరుపురంగు కలుగుతోంది. రక్తకణాలలో హెమోగ్లోబిన్ సాదరణంగా 12 శాతం పైన ఉండాలి. కావల్సినంత హెమోగ్లోబిన్ రక్తకణాలలో లేకపోతే ఎనీమియ అనే జబ్బు వస్తుంది. దీని వలన ఊపిరి తిత్తులకు సమపాళ్లలో ఆక్సిజన్ అందక శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య ఆడవారిలోను , పోషకాహారం లోపించిన పిల్లల్లో వస్తుంటుంది.
బ్లడ్ గుండె నుంచి ధమనుల ద్వారా మంచి రక్తాన్ని శరీర అన్ని భాగాలకు సరఫరా అవుతు శిరల ద్వారా మలినాలతో కూడిన చెడు రక్తాన్ని శుద్ధి చేసి ఊపిరి తిత్తులు కిడ్నీలు చర్మం మలద్వారం ద్వారా విసర్జకాలు బయటకు విసర్జింపబడతాయి.
రక్తంలోని ఏంటిజెన్స్ కుటుంబ వారసత్వ జీన్స్ వల్ల తల్లిదండ్రుల నుంచి వారి సంతానానాకి సంక్రమిస్తాయి. సాధారణంగా ఎర్ర రక్త కణాల మీద ఉండే ఏంటిజెన్స్ ను బట్టి నాలుగు ముఖ్య
బ్లడ్ గ్రూపులుగా విభజించారు.
అవి A ఏంటిజెన్ ఉంటే A బ్లడ్ గ్రూప్ గా
B ఏంటిజెన్ ఉంటే B బ్లడ్ గ్రూప్ గా
రెండు A ,B ఏంటిజెన్స్ ఉంటే AB బ్లడ్ గ్రూప్ గా, ఎటువంటి ఏంటిజెన్స్ లేని బ్లడ్ గ్రూప్ ను O గా నిర్ధారించారు. వీటన్నింటినీ కలిపి ABO బ్లడ్ గ్రూప్ సిష్టంగా నామకరణం చేసారు. సాధారణ నాలుగు బ్లడ్ గ్రూపులే కాకుండా Rh (Rhesus) అనే వేరొక సబ్ గ్రూపు తర్వాత కనుక్కో బడింది. ఈ Rh సబ్ గ్రూపులో కూడా ఏంటిజెన్స్ ఉపస్థితిని (present)బట్టి Rh ఏంటిజెన్స్ ఎర్ర రక్త కణాల మీద కలిగి ఉంటే POSITIVE గాను , Rh ఏంటిజెన్స్ లేకపోతే NEGATIVE గా ధృవీకరించారు
Rh , Negative బ్లడ్ గ్రూప్ ను (Rare) అరుదు బ్లడ్ గ్రూపులుగా స్థిరీకరించారు. ఉదాహరణగా
కామన్ బ్లడ్ గ్రూప్. రేర్ బ్లడ్ గ్రూప్
A+ve. A–ve
B+ve. B–ve
AB+ve. AB–ve
O+ve. O–ve
ABO బ్లడ్ గ్రూప్ సిస్టంలో A,B,O బ్లడ్ గ్రూప్ ల రక్తం జనాభాలో విరివిగా అందుబాటులో ఉన్నా AB +ve బ్లడ్ గ్రూపు రక్తం చాలా తక్కువగా లబ్యమౌతుంది. AB బ్లడ్ గ్రూప్ Rh Negatieve ( Rh–ve) అత్యంత రేర్ గ్రూపుగా గుర్తింప బడింది. మరొక అత్యంత రేర్ గ్రూపుగా బోంబే బ్లడ్ (Oh ) గ్రూప్ కూడా ఉంది.18 సంవత్సరాలు నిండిన యువ స్ర్తీ పురుషులు 65 సం.ల వయోవృద్దుల వరకు వైధ్య పరిక్షల అనంతరం రక్త దానానికి అర్హులు. కావల్సిన శరీర బరువు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి. డాక్టరు పరీక్ష చేసి అన్ని విధాల అర్హులైన వారి నుంచి రక్త సేకరణ చేస్తారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మిషిన్ల ద్వారా ఒక బ్లడ్ డోనర్ నుంచి సేకరించిన రక్తాన్ని ఎర్ర రక్తకణాలు , తెల్ల రక్తకణాలు , ఫ్రోజెన్ ప్లాస్మా, ప్లేట్ లెట్స్ , ఫేక్టర్8 వంటి కాంపొనెంట్సు గా విభజించి తగిన పద్దతిలో భద్ర పరిచి విభిన్న రోగ పేషంట్లకు అందిస్తున్నారు.
ఆధునిక టెక్నాలజీతో బ్లడ్ డోనర్ నుంచి మొత్తం బ్లడ్ కాకుండా కావల్సిన కాంపొనెంట్స్ సేకరించే అవకాశం ఏర్పడింది. లేబోరేటరీలో రక్తదాత బ్లడ్ సేంపిల్ తో రక్తం స్వీకరించే పేషెంట్ రక్తం సేంపిల్ తో బ్లడ్ గ్రూప్ క్రాస్ మేచ్ చేసి ఎటువంటి రియాక్షన్ లేనప్పుడు పేషంట్ కి ట్రాన్స్ ఫ్యూజ్ చేస్తారు పాత రోజుల్లో రక్త దానం చేసే వారిలో ప్రొఫెషనల్, వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్ గా ఉండేవారు
ప్రొఫెనల్స్ బ్లడ్ డోనర్స్ గా రిక్షాపుల్లర్స్ , హోటల్ సర్వర్స్ , చిత్తు కాగితొలు ఏరుకునే వారు , బెగ్గర్న్ డబ్బు కోసం వివిధ ప్రైవేట్ బ్లడ్ బేంకుల్లో పరిమిత సమయానికి ముందే బ్లడ్ అమ్ముకునేవారు.
వారిలో సరైన తిండిపోషణ లేక హెమోగ్లోబిన్ తక్కువగాను అనేక లైంగిక వ్యాధులతో బక్కచిక్కిన శరీరంతో బ్లడ్ ఇచ్చేవారు. అప్పట్లో ఆరోగ్య వంతులెవరూ అపోహలతో రక్తదానానికి ముందుకు రానందున బ్లడ్ బేంకులవారు ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ మీద ఆధార పడవల్సి వచ్చేది. బ్లడ్ సేకరించే ముందు లేబ్ టెస్టులు చేసినా అవి నామ మాత్రమే. అందు వల్ల పేషెంట్లకు అనేక సంక్రమిత వ్యాధులు సంభవించేవి. కాలగమనంలో ప్రభుత్వాలు ప్రొఫెషనల్ డోనర్స్ ని నిషేదించి ప్రజలలో రక్తదానం గురించి అవగాహన
కల్పించి ప్రోత్సహించి నందున వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్ గా యువత, ప్రభుత్వ ఉధ్యోగులు, రోగుల బంధువుల నుంచి రీప్లేస్ మెంటుగా రక్తసేకరణ జరుగుతు ఆధునిక టెక్నాలజీ లేబ్ పరీక్షలు జరుపుతు క్వాలిటీ బ్లడ్ పేషెంట్లకు అందుబాటులో కొచ్చింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా బ్లడ్ డొనేషన్ కేంపులు నిర్వహిస్తున్నప్పటికీ పేషెంట్లకు కావల్సిన పరిమితిలో రక్తం లబ్యం కావడం లేదు. ఆధునిక సౌకర్యాలున్న బ్లడ్ బ్యాంకులు డిపార్టుమెంటు ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ గా మారాయి.
ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటిన బ్లడ్ డోనర్స్ దినంగా పాటిస్తూ రక్తదాతలకు అనేక ప్రోత్సకాలు ప్రకటిస్తున్నాయి. సామాజిక భాద్యతగా యువత ఎటువంటి అపోహలు లేకుండా బ్లడ్ డొనేషన్ కి ముందుకు వచ్చి మానవత్వం కనబర్చాలి. హైదరాబాద్ వంటి నగరాల్లో స్వచ్ఛందంగా చిరంజీవి లాంటి బ్లడ్ బ్యాంకులు పేషెంట్ల అవుసరాలకు అందుబాటులో ఉన్నప్పటికీ బ్లడ్ కొరతగానే ఉంది. ఈమధ్య కాలంలో కోవిడ్ లాక్ డౌన్ ఇతర కారణాల వల్ల బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ కి కొరత ఏర్పడినట్టు తెల్సింది. కనుక యువజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసే అవసరం ఏర్పడింది.
***