సిగ్గు లేకుండా తినండి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నందగిరి రామశేషు
“వేంకట్రామన్ అయ్యంగార్ ఆంధ్రాలో స్థిరపడిన తమిళులు”. ఆయనకి ఒక్కడే కొడుకు, నరసింహన్, యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతనికి కొత్తగా పెళ్ళైంది. భార్య జయంతి. ఆమె తల్లిదండ్రులు కలకత్తాలో స్థిరపడిన తమిళులు. వివాహం జరిగి ఆరు నెలలైంది. ఆరోజు వెంకట్రామన్ గారు తన ముఖ్యమైన మిత్రులను భోజనానికి ఆహ్వానించారు. వంట అత్తగారు లక్ష్మిగారు, జయంతి కలిసి పూర్తిచేశారు. భోజనాలకి సిద్ధం చేశాక అందరూ భోజనాలకు కూర్చున్నారు.మొదట విడత వడ్డన చేసి కోడలు జయంతిని. చూసుకోమని ఆవిడ లోపలికెళ్ళిపోయారు. అందరికీ పప్పన్నంలో నెయ్యి వడ్డిస్తూ జయంతి “అందరు సిగ్గు లేకుండా తినండి.” అంది చిరునవ్వుతో. ఒక్కసారి అందరూ ఆమెనే చూశారు ఆశ్చర్యంగా”. ముందుగా తేరుకున్న వేంకట్రామన్ గారు గట్టిగా నవ్వేసి “మా కోడలు కొత్తగా తెలుగు నేర్చుకుంటోంది. తన ఉద్దేశ్యం ‘సిగ్గు పడకుండా తినండి’ అని చెప్పాలని. భాష సరిగా రాక అలా అన్నది. ఏమనుకోకండి” అనగానే మిగిలిన వారంతా కూడా నవ్వేశారు.