శ్రీమతికీ ఒక లేఖ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
ప్రియమైన రాధకి, నీ కృష్ణ వ్రాయునది ఏమనగా,
ఉభయకుశలోపరి..నువ్వు పండుగకు మీ అమ్మగారింటికి వెళ్లి, అక్కడే సెటిల్ అయిపోయావు.
కాని, ఇక్కడ నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నువ్వు ఉన్నంత వరకు నా చేత ఏ పని చేయనివ్వకుండా అన్ని చేసేదానివి. పుట్టింటికి వచ్చి చాలా కాలం అయిందని మీ అమ్మ నాన్న బతిమాలుతుంటే, కాదనలేక నిన్ను బలవంతంగా పంపించాను. కాని, అపుడు నా పరిస్థితి ఇలా ఉంటుందని ఊహించలేక పోయాను. తెల్లవారే సరికి వేడి వేడి తో లేపే నువ్వు లేక టీ అన్నదే మర్చిపోయాను. పోని అట్లు అయిన చేసుకుందామని చూస్తే నువ్వు అంతా చక్కగా అట్లు ఎలా పోస్తావో కాని, వేసిన అట్లు ఉప్మాలా తయారవుతున్నాయి. ఇంక ప్త్రై చేసుకుందామంటే నీళ్లు వేయకుండా ఎలా అంత చక్కగా వేపుతావో!? గాని, నేను వేపితే అసలు కూరలు ఉడకనే ఉడకవు. ఇంకా బట్టలు విషయం చెప్పక పోవడమే మంచిది. మెున్న మా కోలింగ్ నా షర్ట్స్ చూసి, “షర్ట్స్ కూడా క్రష్డ్ వచ్చాయా!? బాగుంది” అని వెటకారం చేసాడు. మరి నీ చేతిలో ఏ మాయ ఉందో మరి. అంత నిట్ గా ఇస్త్రీ చేస్తావు. ఒక నాలుగు రోజులు నువ్వు లేకపోతే నా ప్రపంచమంతా ) తలకిందులైంది. మరి, అందరూ భార్యలను పుట్టింటికి పంపించి, ఎలా ఎంజాయ్ చేస్తారో అర్థం కావడం లేదు. ఇంతలా సేవలు చేసే ఇల్లాలిని కట్నం అంటూ, కానుకలు తక్కువని పుట్టింటికి పంపే భర్తలు ఉన్న ఈ దేశంలో నేను భర్తగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు తొందరగా వస్తే పువ్వులలో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇస్తూ, నీ రాకకై ఎదురు చూసే
నీ దాసుడు
కృష్ణ