అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )
చేదోడు – వాదోడు
రచన: పి. వి. యన్. కృష్ణవేణి
ఏమి రాయాలో, ఎలా రాయాలో, అసలు ఎన్ని భాధలు రాయాలో వీరి కష్టాలు రాయాలంటే అనిపిస్తుంది ఎవరికైనా…అన్నీ రైతుల కష్టాలే. ఒకటా రెండా వర్ణించటానికి . అనేకం..నిర్మూలన అసాద్యం..
అది ఒక చిన్న పల్లెటూరు. పేరు కానురు. మాది కూడా ఆ పక్కన పల్లెటూరు. కాబట్టి నాకు కానురుతో కూడా అదే అనుభంధం ఉంది. అంతే కాకుండా మా నాన్నకు కూడా ఆ ఊర్లో కొంచెం పొలం ఉండటం వల్ల, ఎక్కువుగా వెళ్తూ ఉండేవాళ్ళం అక్కడకి మా చిన్న తనంలో.
ఎంత అందంగా వుండేది మా పొలం. చుట్టూ పచ్చటి పొలాల మధ్యన, మట్టితో కట్టిన గట్లు. కొంచెం విశాలమైన గట్ట్లు పైన పెంచిన కొబ్బరి చెట్లు. చిన్నప్పుడు ఆ గట్ల మీద పరుగులు పెడుతూ ఆడుకునే వాళ్ళం నేనూ, అన్నయ్య. అప్పటిలో వాటి కష్టాల గురించి తెలియక పడిన ఆనందం అది.
కానీ ఆ రోజులే బాగున్నాయి. కల్లాకపటం తెలియని ఊరు జనాలు, ఎటు చూసినా అందమైన సీతాకోక చిలుకల చీరలా అందంగా ఉండేది ఊరు.
నేను ఉద్యోగం, తర్వాత పెళ్లి పేరుతో మా ఊరు వదిలాను. ఎప్పుడైనా వెళ్లినా ఒక రోజు ఉండి వచ్చేయ్యటమే. నా అదృష్టము ఏమిటంటే, నేను ఇప్పటికీ చిన్న పిల్లలాగా ఆ పొలాల్లో ఆడుతు ఉంటాను.
కానీ ఇది వరకటి ఆనందం ఏదీ మా నాన్న కళ్ళల్లో.. ఎప్పుడూ ఎదో నిరాశ, ఎదో తెలియని బాధ ఆ ఊరి జనాల కళ్ళలో. ఇళ్లు కూడా బాగా తగ్గిపోతున్నాయి. అందరూ చిన్న చిన్న పనులు చూసుకుంటూ, పట్నంకి వెళ్ళిపోయారు.
భూమి మీద ఆశ చావని మా నాన్న లాంటి వాళ్ళు మాత్రం అక్కడే ఉండి పోయారు. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటున్నారు అందరు.
ఏంటి నాన్న ఏమైంది అలా ఉన్నారు? అని అడిగాను.
ఇదివరటి లాగా సమయానికి వానలు ఉండటం లేదు. సంక్షోభం…కరువు పెరిగింది ఊరిలో. కూలి పనులకు కూడా మిగలటము లేదు వచ్చే ఆదాయం. ప్రజల మంచితనం వల్ల ఎలాగో గడుపుకుంటున్నాను అన్నారు.
పోని వేరే ఏదైనా…. అని అడిగితే….
అదీ అయ్యింది. ఊరు వదిలి వెళ్ళిన కూలీలు అందరూ కూడ పనులు లేక, వాళ్లు ఇచ్చే కూలి సరిపోక, ఉన్న ఊరిలో బతక లేక, అప్పుల పాలు అయ్యి, ఉన్న పొలాలను అమ్ము కున్న వాళ్ళు ఉన్నారు మన ఊరిలో అని తన బాధ చెప్పుకున్నారు నాకు.
ఈ కొంచెం పొలమైనా అన్నయ్యకు మిగల్చగలనో లేదో అమ్మా అంటూ బాధ పడ్డారు.
ఏమీ కాదులే నాన్న, ఇద్దరూ కలసి చేసుకోండి, ఉన్న పొలంలోనే కొంచెం పెట్టుబడితో వ్యవసాయ నవీకరణ మొదలుపెట్టండి అని నా ధర్మంగా ఒక సలహా ఇచ్చాను.
కానీ నాకు తెలుసు ఏ రంగం అయినా మాటలు చెప్పినంత సులభం కాదు పనులు చేయటం అని.
నాన్నని ఓదార్చాలి అని అలా అన్నాను కానీ, నా మనసుకు తెలుస్తోంది ఆ ప్రజల బాధ. కాదు ఆ రైతుల విషాదం నిండిన కళ్లు చెపుతున్నాయి.
***