తెలివైన తీర్పు
రచన::కవిత దాస్యం
భీమునిపట్నం లో సచ్చిదానంద వర్మ అనే ఊరు పెద్ద ఉండేవారు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి..
ఆయన ఒకరోజు బజారుకు వెళుతుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు. మరో కతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం… పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తూ ఉండగా, అది జారీ జమిందార్ కోడి పై పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడి తో నా కోడిని అన్యాయంగా చంపేసావు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వెల చెల్లించు అన్నాడు. పనివాడు అయ్యా నేను బీదవాడిని అంత డబ్బు చెల్లించలేని పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది. క్షమించండి.
కోడి వెల మాత్రం కట్టలను. అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి సచ్చిదానంద వర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పు ఇస్తాడని ఆశించారు. జమీందారు పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయం వివరించారు.
కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ జమీందారు వాదన సరైనదే, పనివాడు అతనికి కోడి వెల సంవత్సరం అంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం వంద రూపాయలు చెల్లించవలసినదే, అని చెప్పాడు.
అది విన్న అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశ పడ్డాడు.
సచ్చితానంద వర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు, అని కొనసాగించాడు. జమిందార్ తో కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి ఒక సంవత్సరంలో ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. రెండు బస్తాలు స్వామి అన్నాడు. జమిందార్ అయితే ఆ రెండు బస్తాల ధాన్యం వెల ను నువ్వు పని వాడికి ఇవ్వు అన్నాడు. సచ్చిదానంద వర్మ.
ఆయన తీర్పు అర్థంకాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరాంతం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది. కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చు ను నువ్వు అతనికి ఇవ్వాలి. కద అంటూ వివరించాడు. సచ్చిదానంద వర్మ రెండు బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమిందార్.
గుమికూడిన జనం అందరూ తీర్పు విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు, కాబట్టి తనకు ఏమి ఇవ్వనక్కరలేదని జమిందారు ఒప్పుకొన్నాడు.
నీతి:అతిగా ఆశ పడితే అసలు దక్కకుండా పోయింది.
***