వృక్షో రక్షతి రక్షితః
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
నేటి బాలలే రేపటి పౌరులు. సమసమాజాభివృద్ధి జరుగుటకు రథసారధులు. సాధారణంగా పిల్లలు అనుకరణ ద్వారా విషయాలను తెలుసుకుంటారు. బాల్యంలో తల్లిదండ్రులు, పాఠశాలలో గురువులు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి తాము ఆచరించి చెప్పిన ఆరోగ్యవంతమైన సమాజాభివృద్ధి జరుగుతుంది. బాల్యంలో మా గ్రామంలో విశాలమైన పెరట్లో తాతయ్య మాచే నాటించిన మామిడి, చింత, ఉసిరి మొక్కలు మందార, మల్లి, గులాబీ , కనకాంబరం మొక్కలు వాటికి నీళ్ళు పోసి పెరిగి పెద్దదయిన తరువాత వాటి పుష్పాలను కోయడం, అలాగే మామిడి కాయలు ఉగాది పచ్చడి కి చెల్లితో చెట్టెక్కి తెంపడం, కోయలల, చిలుకలు, చిన్ని చిన్ని పిచ్చుక ల కుహు కుహు, కిలకిలారావాలు పచ్చటి తులసికోటలో తులసమ్మ నేడు కనుమారుగవుతున్నాయి. మా ఉన్నత పాఠశాలలో వారానికి రెండు రోజులు తోటపని మాచే సైన్స్ మాష్టారు చేయించి మొక్కలు వేసి, నీళ్ళు పోయించేవారు. విశాలమైన ఆటస్థలంతో బాటు చుట్టూ రావి, అశోక వృక్షాలు ఉండేవి. మాష్టారు ఒరే మనం పనికిరాని బొగ్గుపులుసు వాయువుని వదిలితే అది మొక్క స్వీకరించి బదులుగా నీకు ప్రాణవాయువు ని ఇస్తుందిరా అని చెప్పి తాను గొప్పులు తీసి మొక్కలు ఎలా వేయాలో చెప్పేవారు. ఇప్పటికి వెయ్యిమంది విద్యార్థులు గల మా ఊరి పాఠశాలలో మేము వేసిన మొక్కలు వృక్షాలయి పాఠశాలలో పసిడి చిన్నారులతో బాటు పచ్చటి వాతావరణంతో అలరిస్తుంటే నా మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. నేటి సమాజంలో మనిషి స్వార్ధంతో , సంకుచితంగా తన అవసరాలకు మొక్కలను నరికి కాంక్రీటు వనాలుగ మార్చి నేటి భూతాపాలకు, సునామీలకు నిజం చెప్పాలంటే తన వినాశానానికి తానే కారణభూతుడు. కావున వృక్ష పరిరక్షణ ధ్యేయంగా చిప్కో ఉద్యమస్పూర్తి బహుగుణ మరియు మేధపాట్కర్ ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ లో భాగస్వాములై పశు ప్యాక్ష్యాదులకు ఆవాసయోగ్యమైన వృక్షాలను” వృక్షో రక్షతి రక్షితః” అన్నదే ధ్యేయంగా పరిరక్షించి సమాజాభివృద్ధికి తోడ్పడదాం…..!!
***