మాటల్లో నీతి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
వ్యాసకర్త: పి. వి. యన్. కృష్ణవేణి
మాటల్లో తియ్యదనం చేతల్లో ఉండదు. మాట మంచితనంలో గొప్పతనం ఉండదు. చేతల్లో చూపించు నీ మంచితనాన్ని. ఎదుటివారికి సహాయం అందించటంలో ఉంటుంది నీ గొప్ప. మాటలతో కాలం గడిపేస్తే, నీ విలువ తెలియదు.
నీ ఆలోచనలు నీతోనే అంతం అయిపోకూడదు. ఆ ఆలోచన పది మందికి తెలియాలి. ఆ ఆలోచన వంద మందికి ఉపయోగపడాలి. నువ్వు ఎంచుకున్న మార్గం గొప్పగా ఉంటే, నీ అడుగు జాడల్లో వంద మంది నడుస్తారు. అందరి సహాయంతో మనం గమ్యం చేరటం చాలా తేలికవుతుంది. మాటల్లో ఉన్న చలాకి తనం చేతల్లో లేకపోతే చూసే వారికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. మనల్ని అపహాస్యం చెయ్యటానికి అవకాశం ఉంటుంది. అది ఎదుటివారికి ఇవ్వద్దు. వారి దృష్టిలో మనం చులకన కావద్దు. కొంత మంది మాటల్లో ఉన్న నీతి, వాళ్లు చేసే పనుల్లో కనిపించదు. నీతి మాటలు చెప్పటం కాదు, నువ్వు చేసే ప్రతి చర్యలో ఆ నీతి కనిపించాలి. నీతులు చెప్పటానికే, చేతల్లో పనికిరావు. అన్న చందాన, ఉండకూడదు నువ్వు చెప్పే మాటలు. గాంధీ మహాత్ముడు వద్దకు ఒక బాబును తీసుకువచ్చింది ఒకామె. ఆ బాబుకు బాగా బెల్లం తినే అలవాటు. తీపి ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆమె ఉద్దేశ్యం. మీరంటే మా వాడికి చాలా ఇష్టం. మీరు చెపితే మా వాడు ఖచ్చితంగా వింటాడు. వాడికి మీరు తీపి ఎక్కువ తినవద్దని చెప్పమని అడిగింది. దాని కోసం వారం రోజులు ఆగి రమ్మని చెప్పారు. వారం తరువాత బాబును తీసుకుని వచ్చిందామె. ఆ బాబును దగ్గరకు పిలిచి, నువ్వు తీపి పదార్థాలు ఎక్కువ తినకు అని చెప్పారు.గాంధీజీ, ఇది చెప్పటానికి వారం తీసుకున్నారు ఎందుకు? అని అడిగింది.
నాకూ ఆ తీపి తినే అలవాటు ఉంది. నేను ఆ అలవాటు మానుకుని, మీ వాడికి చెప్పాను.
నీతులు చెప్పేటప్పుడు, ఆచరణలో చూపాలి. అన్నారు అందుకే, నీతులు చెప్పటానికే కాదు. ఆచరణలో కూడా చూపాలి.