ప్రజా ఉద్యమం
-చంద్రకళ. దీకొండ
దశాబ్దాలు సాగిన ప్రజా ఉద్యమం…!
ఎందరో త్యాగవీరుల, రైతుల,
విద్యార్థుల బలిదానాలతో…
సకల జనుల సమ్మెతో
సాధించుకున్న అస్తిత్వం…
ప్రపంచ పోరాటాలకు
నమూనాగా నిలిచిన ఉద్యమం…!
ఖమ్మం రైల్వే స్టేషన్ లో…
రవీంద్రనాథ్ మొదలుపెట్టిన…
ఉద్యోగాలకై ఉద్యమం…
369 మంది విద్యార్థుల ఉసురును
పణంగా పెట్టి సాగించిన ఉద్యమం…!
యాదగిరి,కొమురయ్య,
ఐలమ్మల పొలికేకలు…
సురవరం ప్రతాపుని”గోల్కొండ”
పత్రికా రచనలు…
జయశంకర్, కోదండరాంల
విజ్ఞాన రీతులు…
దాశరథి, కాళోజీ కవుల
చైతన్య కవితలు…
ఆరుట్ల కమలాదేవి,
మల్లు స్వరాజ్యంల
త్యాగ నిరతులు…
ఆజ్యంగా సాగిన
ప్రజా ఉద్యమం…!
ఆసఫ్ జాహీ పాలనకు…
నిజాం పాలకుల నిరంకుశత్వానికి…
రజాకార్ల దౌష్ట్యానికి వ్యతిరేకంగా
సాగిన మహోద్యమం…!
“జల్…జంగిల్…జమీన్”
ఆశయంగా
ఆదివాసీలు దొరల
జమీందారీకి
నిరసనగా సాగించిన
సాయుధ పోరాటం…!
జై తెలంగాణ…
జయహో తెలంగాణ…!!!
***