(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
అంతరంగం గొంతు పెగిలి.!
రచన: సత్య కామఋషి ‘ రుద్ర ‘
అంతరంగం గొంతు పెగిలి,
కనులకు కట్టిన రూపమై కదిలి,
ఎవ్వరంట నువ్వని.,
నీకు నువ్వు ఎవరివని,
లోకానికి నువ్వెవరని..!
ఏడనుండి వచ్చావని,
ఏడకు పోతున్నావని..!
నీ గమ్యం ఏ తీరమని,
నీ పుట్టుక పరమార్థం,
ప్రయోజనం ఏమిటని..!
నేటికి ఏమున్నది నీ ఘనత.?
రేపటికి ఏముండును నీ చరిత.?
నువ్వెందులోన ఎక్కువటంటూ.,
ప్రశ్నిస్తే…నిన్నే నిలదీస్తే..!
ఏమని బదులు చెప్పగలవు..!!
అలా పుట్టి, ఇలా గిట్టు.,
అనేకులలో ఒకడిననా..!
చుక్కల్లో చంద్రుడిననా.!
నిన్ను నిన్నుగా చూపే,
ప్రత్యేకత ఏదో ఉందనా..!
ఏ రూపం వైశిష్ట్యం ఎరుగని,
చలనం లేని బండ రాతిననా.!
రంగుల ఆశల రెక్కలు తొడిగి,
ఊహల పల్లకీలో అనునిత్యం,
ఊరేగే చపలచిత్తపు కోతిననా.!
నాయకుడివా..సహాయకుడివా
ధీరుడవా..పరాధీన భీరుడవా
రాముడివా..రావణుడివా..
త్యాగివా, భోగివా,ఆత్మయోగివా
నీకు నువ్వైనా తెలుసునాయని
ప్రశ్నిస్తే…నిన్నే నిలదీస్తే..!
ఏమని బదులు చెప్పగలవు..!!
****************************
స్పందించ తగునది కాదా నా రాత,
ఏ చూపుకునా నోచుకోదా..!
చదువ తగునదైనా కాదా నా రాత,
ఇసుమంత విలువయు లేదా..!
కవితని నే భ్రమపడితినేమో,
ఏమో..కవిత కపితైన తీరిదేమో..!