మానవత్వం బ్రతికే వుంది
రచయిత :: జె వి కుమార్ చేపూరి
రాముడి భార్య పద్మ నిండు గర్భిణీ. రాముడి భార్య బలహీనంగా ఉండడంతో, పట్నంలోని పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్ళవలసిందిగా గ్రామ వైద్యుడు సూచించాడు. రాముడు తన భార్య పద్మను బెంగుళూరులోని ఒక పెద్ద ఆసుపత్రికి కాన్పు కోసం తీసుకొని వచ్చాడు. పెద్దాసుపత్రిలో వైద్యుడు పద్మను పరిశీలించి, రాముడితో ఈ విధంగా అన్నాడు. నీ భార్య చాలా బలహీనంగా ఉంది. వెంటనే రక్తం ఎక్కించాలి, లేక పోతే ప్రమాదం అని సూచించాడు. పద్మది బి+ గ్రూపు రక్తం. ఆసుపత్రిలో రక్తం నిలువ ఉంచే బాంకు, కోవిడ్ కారణంగా మూసివేయబడింది. అప్పుడు రాముడు తన రక్తం తీసుకోవలసిందిగా వైద్యుడిని కోరాడు. కానీ రాముడిది ఏ+ గ్రూప్ రక్తం కావడం వలన, అది పనికి రాదని వైద్యుడు చెప్పగా రాముడు బి+ రక్తం తేవడానికి బయటకు పరుగులు తీసాడు. బయట తిరగడానికి నిషిద్ధ ఆజ్ఞలు (కర్ఫ్యూ) అమలులో ఉండటంవలన, బయటకు వచ్చిన రాముడిని పోలీసు పట్టుకుని పోలీసు స్టేషనుకు తీసుకొని పోబోయాడు. అప్పుడు రాముడు తన కష్టాన్నంతా ఆ పోలీసుకు చప్పగా, అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు రాముడిని తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు పోలీసు. వైద్యుడిద్వారా నిజాన్ని తెలుసుకుని, తన రక్తం బి+ అని వైద్యునికి చెప్పి తన రక్తాన్ని పద్మకిచ్చి తల్లీ బిడ్డల ప్రాణాలను నిలబెట్టాడు.
ఇది తెలిసి పోలీసు ఉన్నతాధికారి (డి స్ పి), పోలీస్ నిజాయితీని మెచ్చి ఇరవై అయిదు వేల రూపాయల పారితోషికాన్ని అందజేశాడు. రాముడి పేదరికాన్ని, అతని పరిస్థితిని స్వయంగా గ్రహించిన పోలీస్ ఆ ఆసుపత్రి ఖర్చులన్నీ భరించి, మిగిలిన పారితోషికం మొత్తాన్ని రాముడికి అందజేసి తన మంచితనాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు. ఆ పోలీసు పేరు మంజునాథ్.
మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చెప్పే ఈ చిన్ని కథ ఇటీవల బెంగుళూరులో జరిగిన యదార్ధ గాథ.
***