అంశము : వ్యాసం
పురుటింటి తెరువరి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
వ్యాసకర్త: చంద్రకళ. దీకొండ
“చిక్కు చీకటి జిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణుండు”. “తల్లిదండ్రుల తనూవల్లరీద్వయికి వన్నియబెట్టు తొమ్మిది నెలల పంట”. అంటూ శిశు జననమును సుందరంగా వర్ణిస్తూ. “జననీ జఠర శయన ప్రసవాబ్ది తరియించి వచ్చిన పరదేశి”.
“నవమాసములు భోజనము నీరమెరుగక.
పయనించు పురుటింటి బాటసారి”.
“ఎవ్వరెరుంగరితనిదే దేశమోగాని. మొన్న మొన్ననిలకు మొలిచినాడు”. అంటూ తాత్వికతను జోడించి. “నునుచెక్కిళ్ళ బోసినోటి నవ్వులలోన.
ముద్దులు చిత్రించు మోహనుండు” “అక్షయంబయిన మాతృక్షీర మధుధారలన్నంబుగా తెచ్చుకున్న యతిథి”. “ధారుణీ పాఠశాలలోన చేరినాడు”…!
“బొటనవ్రేల ముల్లోకములంచూచి. లోలోననానందపడు నోరులేని మౌనయోగి”. అంటూ మనోహరమైన విశేషణాలను కూర్చి.”అమ్మ కౌగిట పంజరపు చిలుక”. “గానమాలింపక కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు”. ఉయ్యాల్లో ఉల్లంలో ముద్దులు కురిపిస్తాడు” అంటూ శిశువు చేష్టలను మురిపెంగా తెలిపి.! “అమృతంబు విషము వ్యత్యాసమెరుగక, ఆస్వాదించు చను వెర్రిబాగులవాడు”. “ఏండ్లు గడిచిన ముందు ముందేమో గాని. ఇప్పటికి మాత్రమే పాపమెరుగని వాడు”. “మా చిట్టిపాప ఒళ్ళో ముత్యాలు పోశాడు.
నెలబాలుడై ఆనందాన్ని కుప్పవోశాడు”. అంటూ పసిబాలుని నిష్కల్మష తత్వాన్ని అతడు అందించే ఆనందాన్ని అందమైన పదాలలో పొదిగి…! “ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి పసిడికొండ రత్నమని. తల్లి పలుకు పలుకులితండు నిలుపుగాక” అంటూ ఆశీర్వచనాలతో ముగించిన జాషువా గారి ఖండకావ్యం.! ఎప్పుడు చదివినా. శుద్ధ సావేరి, శుద్ధ సారంగ్, ఆభేరి మరియు భాగేశ్వరి రాగాలతో కూర్చబడిన ఆ పద్యాలను ఘంటసాల వారి గళాన విన్నా. మధురానుభూతిని కలిగించు మధురగానం..!