సైకిల్ గర్ల్ (బయోగ్రఫీ అఫ్ జ్యోతి కుమారి)
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)
రచన: రవికుమార్. యం
నా పేరు జ్యోతి కుమారి. నేను దూర విద్యలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నా .ఈ కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఈ పాటికే నా ఇంటర్ పరీక్షలు అయిపోయేవి. మా సొంత రాష్టం ఒడిస్సా లోని బాలాసోర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం. బ్రతుకు తెరువు కోసం వలస వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నాం. మా నాన్న రిక్షా డ్రైవర్ ,నేను మా నాన్న హైదరాబాద్ లో ఉంటే, మా అమ్మా , నలుగురు తమ్ముళ్లు, మా సొంత ఊరులో ఉంటారు. అమ్మ అంగనివాడి పిల్లలకు వంటలు చేస్తారు . అమ్మ కి వచ్చే డబ్బులు మా తమ్ముళ్లని పెంచటానికే సరిపోదు. వాళ్లలో ఇద్దరు తమ్మల్లు చదువుకుంటున్నారు. వాళ్ళ చదువు ఆగిపోకూడదనే నేను హైదరాబాద్ వచ్చి ఇలా నాన్నతో పాటే పని చేసుకుంటున్నా.నాన్న ఆటో డ్రైవర్ వచ్చే డబ్బులు మొత్తం మందు తాగటానికి తగలేస్తాడు. నేను ఇంటింటికి తిరిగి పనులు చేయడం వల్ల వచ్చే డబ్బులు ఇంటి అద్దెకి, వంట సామాగ్రి కొనటానికి సరిపోతోంది. కానీ అమ్మా వాళ్ళకి డబ్బులు పంపించలేకపోతున్నా పాపం అమ్మ తమ్ముళ్ల తో ఎన్ని కష్టాలు పడుతుందో, అని తలచి ఏడవని రోజు అంటూ ఉండదు. నేను చదవడం కూడా నాన్నకి ఇష్టం లేదు. నేనే చదువుకోలేదు అలాంటిది అమ్మాయివి నీకు ఎందుకు చదువు అంటాడు.అమ్మే గనుక చదువుకుని ఉంటే నాతో పాటు నిన్ను కూడా బాగా చూసుకునేది మనం ఇలా గొడ్డులా చాకిరీ చేయవలసిన అవసరం ఉండేది కాదు, అందుకే ఆడపిల్ల చదువుకోవాలి అని నాన్నతో చాలా గొడవపడి మరీ ఓపెన్ ఇంటర్ వరకు చదువుకుంటూ వచ్చాను. అదేమంత సులభం గా జరగలేదు,చాలానే కష్టపడవలసి వచ్చింది. ఉదయాన్నే లేచి ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ వేసేదాన్ని.మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ త్వరగా ముగించుకొని, చుట్టు పక్కల ఇళ్లకు పోయి వాళ్ళ ఇంట్లో పనులు చేసేదానిని.అసలు చదవడానికి టైం కూడా ఉండేది కాదు.రోజంతా పనులు చేసేసరికి ఒళ్ళు హునం అయిపోయి ,రాత్రి త్వరగా నిద్ర వచ్చేది కానీ !మేల్కొని మరీ చదివేదాన్ని అలా కష్టపడుతూ ఇంటర్ వరకు చదువుకున్నా.
నా వయసులో ఉండే చాలా మంది పిల్లలు ఆనందంగా ఆడుకుంటుంటే చూసి , ఏమీ చేయలేని నా నిస్సహాయత చూసి నామీద నాకే జాలి పుట్టేది. ఒక రోజు రాత్రి నాన్నకి నాకు పెద్ద గొడవ , బాగా తాగి ఇంటికి వచ్చాడు. నన్ను బాగా కొట్టి, నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని లాక్కొని తాగటానికి బయటకు వెళ్ళిపోయాడు.నాకు చాలా భాద వేసింది. చనిపోవాలనుకున్నా ,మా ఇంటి దగ్గర్లోనే రైల్వే ట్రాక్ ఉంది. ట్రైన్ కిందపడి చనిపోదామని వెళ్ళాను. రైల్వే స్టేషన్ పక్కనే కొన్ని గుడిసెలు ఉంటాయి కొంత మంది అడుక్కునే వాళ్ళు అక్కడ ఉంటారు. నేను స్టేషన్ కి వెళ్లేసరికి గుడిసెలు పక్కన చెట్లు పొదల్లో ఒక జంట రాత్రి సమయం కావడం తో ఎవరూ రారు అని,ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఏకాంతం లో సుఖాన్ని అనుభవిస్తున్నారు. నేను నేరుగా వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోయాను.నేను వెళ్లేసరికి బట్టలు వేసుకుని కొద్దిగా దూరంగా జరిగి ఆశ్చర్యంగా నా వైపు చూసారు.
మీరు భార్య భర్తలా, పిల్లలు ఉన్నారా అని అడిగాను?..నలుగురు పిల్లలు ఉన్నారు అని చెప్పారు.
వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగాను?గుడిసెలో పడుకున్నారు అని చెప్పారు.
నాకు కోపం పెరిగిపోయింది.మీకు కనీసం ఏకాంతానికి కూడా చోటు లేదు అంత దరిద్రమైన బ్రతుకు బ్రతుకుతున్నారు మీకెందుకు పిల్లలు. మీ 4గురు పిల్లలు కూడా మీలానే బ్రతకాల్సిందేనా?మీకే తినడానికి తిండి లేదు,మళ్ళీ మీకు పిల్లలు కావాలి, సుఖం కావాలి సిగ్గులేదు, మన దేశంలో దేనికి లోటు ఉన్న కానీ, పిల్లలు కనడానికి మాత్రం ఏ లోటు లేదు. అందుకే అంత జనాభా అని గట్టిగా అరిచి,నేను చనిపోతే బ్రతికి ఉన్న తన నలుగురు తమ్ముళ్లు ఏమైపోతారో అని బయపడి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది జ్యోతి .
ఇలాఎన్నో బాధలు, ఇంటి పనులు, నాన్నతో గొడవలు, చదువులతో ఇంటర్ వరకు నెట్టుకొచ్చా.అది 25 మార్చ్ 2020 7 am అవుతోంది అందరి ఇళ్లలో న్యూస్ పేపర్ వేసి ఇంటికి వచ్చాను. మా నాన్న తాగి ఆటో నడుపుతూ కింద పడిపోయి కాళ్లకు దెబ్బ తగిలించుకుని వారం నుండి పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. నేను వెళ్లేసరికి మంచం మీద పడుకుని ఉన్నాడు.ఇదిగో నాన్న ఇప్పుడే న్యూస్ పేపర్ లో చూసాను కొత్త జబ్బేదో వచ్చింది అంట, లాక్డౌన్ పెట్టారు బయటకు వెళ్తే పోలీసువాళ్ళు కొడతారు. రేపటి నుండి నేను ఇంటింటికి వెళ్లి పనులు చేయడానికి కూడా కుదరదు. నీకేమే కాలు బాగాలేదు, మరి డబ్బులు ఎలా వస్తాయి?ఈ నెల ఇంటి అద్దె ఎలా కడతాం?ఇంట్లో కూరగాయలు, బియ్యం,ఒక వారానికి మాత్రమే సరిపోతాయి. 21 రోజులు లాక్డౌన్ అంట .పేపర్ లో చూసా అని చెబుతున్నా నా మాట పట్టించుకోకుండా పక్కన పెట్టుకున్న మందు బాటిల్ లో ఉన్న మందు తాగి మళ్ళీ పడుకున్నాడు.
తినటానికి తిండి లేదు. ఇంక చేసేది లేక పరీక్ష కోసం దాచుకున్న 1000 రూపాయలతో రోజుకు ఒక పూట తింటూ ఏప్రిల్ 20 వరకు ఎలానో సర్దుకున్నాం. ఆ తరవాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, ఇంటి అద్దె ఎలా ఇవ్వాలో తెలియట్లే. పోనీ బయటకు వెళ్లి ఎవరినైనా డబ్బులు అడుగుదామంటే, ఈ ముష్టి కరోనా వ్యాధి ఎక్కడ సోకుతుందో అని అదొక భయం. ఆకలితో కడుపులో మంట, కళ్ళలో నీరు, ఈ సంవత్సరం ఎలా అయినా ఇంటర్ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం తెచ్చుకును అమ్మ, తమ్ముళ్ళని బాగా చూసుకోవాలనుకున్నా, కానీ కరోనా వల్ల పరీక్షలు కూడా ఆగిపోయాయి.ఒక వైపు నాన్న పరిస్థితి దారుణంగా ఉంది .కాళ్ళకి తగిలిన దెబ్బ సెప్టిక్ అయినట్టు ఉంది. సీము పట్టింది.మందుకి అలవాటు పడిన వాడు,ఇప్పుడు మందు లేక అల్లాడుతున్నాడు పిచ్చోడిలా తయారయ్యాడు.కొత్తగా నిన్నటి నుండి ఆకలి ఇంకో సమస్యలా తయారైంది. 2 రోజులు నుండి ఏం తినకుండా ఇంట్లో పడి ఉన్నాం ,కేవలం నీళ్లు తాగి బ్రతుకుతున్నాం. ఇలానే ఇంకో 2 రోజులు ఉంటే చనిపోయేలా ఉన్నాం. చేసేదేం లేక ఓపిక లేకపోయినా మా బస్తీ కి దగ్గర్లో నేను పనిచేసే ఇంటికి వెళ్ళాను, తినడానికి ఏమైనా అడుగుదామని,వాళ్ళు నన్ను చూసి తలుపు వేసుకున్నారు.ఇంకో రెండు ఇళ్లలో ఇదే పరిస్థితి ఎదురైంది. నడవడానికి ఓపిక లేక రోడ్ మీద స్పృహ తప్పి పడిపోతున్న నన్ను ఒక పోలీసు అతను చూసి దగ్గరకి వచ్చి ఎందుకమ్మా బయటకు వచ్చావ్.లొక్డౌన్ అని నీకు తెలీదా.ఇంత నీరసంగా ఉన్నావ్ అని అడిగి నా పరిస్థితి చూసి తన దగ్గర ఉన్న 3 అరటి పళ్ళు ఇచ్చి తినమని చెప్పి 2వందలు రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అరటి పళ్ళు తిని, ఆ 2 వందలు జాగ్రత్త గా పట్టుకుని ఒక దుకాణానికి వెళ్లి కొన్ని సరుకులు కొని ఇంటికి వెళ్లి వండి నాన్నకి పెట్టాను. చాలా ఆత్రంగా తిన్నాడు ,మందు కన్నా అన్నం ఎంత గొప్పదో నాన్నకు తెలిసినట్టుంది. తింటూనే కంట్లో నీరు తిరిగాయి నాన్నకి. ఇలా ఒక పూట భోజనం చేస్తూ మే 1 వరకు ఎలానో గడిచింది . ఇంటి యజమాని వచ్చి అద్దె ఇవ్వలేదని మా సామాన్లు బయట పడేసాడు. ఎక్కడకి వెళ్లాలో తెలియదు. అలా కొన్ని సామాన్లు.నా పాత సైకిల్ పట్టుకుని రోడ్ మీదకి వచ్చాము.ఆ రాత్రి బస్ స్టాండ్ లో పడుకున్నాం..అసలే ఆడపిల్లని కావడం కొంత మంది గంజాయి కొట్టేవాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, అక్కడ ఉండడం మంచిది కాదని రైల్వే స్టేషన్ కి వెళ్లి పడుకున్నాం.వాళ్ళు కూడా తరిమేసారు. ఇలా వారం రోజులు కుక్కల కన్నా హీనంగా ఎక్కడ పడుకున్నామో తెలియదు , అంతలో నాన్నకి జ్వరం వచ్చింది. అసలే తిండి లేక చస్తున్న మాకు కరోనా వచ్చింది నేను ఎలానో తట్టుకున్నా కానీ నాన్న కి ఆ రాత్రి ఊపిరి సమస్య వచ్చింది.. నాకు ఏడుపు వస్తూనే ఉంది ఏమీ చేయలేని నిస్సహాయత.పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లాను అక్కడ చాలా మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు. జాయిన్ చేయట్లేదని హాస్పిటల్ బయట రోడ్ మీద ఉన్నారు.మెల్లగా నాన్నని అక్కడే చెట్టుకింద కూర్చోబెట్టి లోపలికి వెళ్లి కొన్ని టాబ్లెట్స్, నీరు తెచ్చి నాన్నకి ఇచ్చాను.. నాన్న పక్కనే ఎవరో పడుకున్నారు ఎవరా అని పైన దుప్పటి తీసేసరికి అది చనిపోయిన కరోనా పేషెంట్ అనాధ శవం. ఎవరో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు అలా 2 రోజులు పేషెంట్స్ శవాలు మధ్య గడిపాక. హాస్పిటల్ లో జాయిన్ చేసుకున్నారు.. అన్నం పెట్టారు ఆకలితో చనిపోవాల్సిన మేము ఇలా హాస్పిటల్ అన్నంతో బ్రతికాం.. అది మే 8 నాన్న నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చాము, మళ్ళీ ఆకలి కష్టాలు మొదలయ్యాయి. కొంత మంది అన్నం పొట్లాలు పంచారు తిన్నాం. అమ్మ అక్కడ ఎలా ఉందో అని భయం వేసి పక్కన అతన్ని మొబైల్ అడిగి అమ్మ కి కాల్ చేశా,తమ్ముడు ఫోన్ ఎత్తాడు.. అక్కా అమ్మ కు జబ్బు చేసిందే మాకు దూరంగా ఊరిబయట పెట్టారు..మేం ఇంట్లో ఉన్నాం ఆకలిగా ఉంది ఎవరూ అన్నం పెట్టట్లేదు. అని ఏడుస్తూ చెప్పేసరికి. నాకు ఏడుపు ఆగలేదు .ఊరికి వెళ్లిపోవాలని అప్పుడే అనుకుని నాన్న కి చెప్పా ,ఎలా వెళ్ళగలం ట్రైన్ లేదు కదా అని నాన్న అన్నాడు.
మళ్ళీ అమ్మ కి ఫోన్ చేస్తే తమ్ముడికి కూడా జ్వరంగా ఉందని చెప్పారు ఎలా అయినా వెళ్లి పోవాలని అనుకున్నాను.
మే 10 2020 నా పాత సైకిల్ నేను నాన్న బయలుదేరాం. హైదరాబాద్ నుండి మా ఊరు దాదాపుగా 1200 km ఉంటుంది.నాకు దూరం కనిపించలేదు. అమ్మ, తమ్ముడు ఇద్దరే కనిపిస్తున్నారు, రోజంతా తొక్కుతూనే ఉన్నా ఉదయం కొద్దిగా తిన్న అన్నం కడుపులో ఉంది. శక్తి ని కూడదీసుకుని సైకిల్ తొక్కుతూనే ఉన్నా నాన్న వెనుక కూర్చుని ఉన్నాడు. మా దగ్గర కొన్ని సామాన్లు అమ్మేసాం ఒక 5వందలు వచ్చాయి. దాదాపుగా మొదటి రోజు చీకటి పడేసరికి జనగాం వరకు వచ్చాము.ఆరోజు దాదాపుగా 120 km సైకిల్ తొక్కి ఉంటా.. రాత్రి ఒక ధాబా దగ్గర ఆపి తిన్నాం. అక్కడే 10 గంటలు నుండి ఉదయం 3గంటలు వరకు పడుకుని మళ్ళీ సైకిల్ ఎక్కి బ్రతుకు సవారీ మొదలెట్టాం 2 వ రోజు పూర్తయ్యే సరికి ఖమ్మం చేరుకున్నాం.నాకు కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నేను రోజు ఉదయాన్నే సైకిల్ మీద న్యూస్ పేపర్స్ వేసిన అలవాటు ఉపయోగపడింది. లేకపోతే వేరే వాళ్ళైతే ఈపాటికే ప్రాణాలు వదిలే వారే .. 3 వ రోజు ప్రయాణం ఖమ్మం దాటి రాజమండ్రి గోదావరి కొద్ది దూరంలో ఉన్న సమయంలో ఎండ ఎక్కువుగా ఉంది. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరిగాయి ,నేను వెనుక కూర్చున్న నాన్న ఇద్దరం రోడ్ మీద పడిపోయాం. నాన్న కాలికి మళ్ళీ గాయం అయ్యింది .అప్పుడు రాజమండ్రి వైపుగా వెళ్తున్న వ్యాన్ ఒకటి ఆగి మమ్మల్ని పైకి లేపి నీరు తాగించి . వ్యాన్ ఎక్కించు కున్నాడు.మేం రాజమండ్రి వెళ్లి ధాబా దగ్గర ఆగి బోజనం తిని అనకాపల్లి వరకు వ్యాన్ లో వెళ్ళాం. వ్యాన్ అంకుల్ మమ్మల్ని అక్కడ దించి వేరే మార్గం లో వెళ్ళిపోయాడు .అతనికి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ సైకిల్ మీద ప్రయాణం మొదలు.పెట్టాం
3 వ రోజు రాత్రి సమయానికి వైజాగ్ లో ఉన్నాం . అక్కడే తమ దగ్గర చివరిగా మిగిలిన డబ్బులుతో తిని పడుకుని మే 13 ఉదయాన్నే సైకిల్ యాత్ర మొదలెట్టాం . మధ్యాహ్ననికి విజయనగరం దాటి శ్రీకాకుళం లో ఎంటర్ అయ్యాం ..రాత్రికి పలాస చేరుకున్నాం ఆకలి వేస్తుంది కానీ మా దగ్గర డబ్బులు లేవు .రాత్రికి అక్కడే బస్ స్టాండ్ లో పడుకున్నాం అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి నిద్ర లేపి ఎక్కడ నుండి వచ్చారు అని అడిగారు . మేము హైదరాబాద్ నుండి వచ్చాము అని చెప్పాను. అయినా వాళ్ళు నమ్మలేదు నిజంగా అది అసాధ్యమే కదా!కానీ నేను మధ్యలో జరిగిన విషయాలు అన్ని చెప్పేసరికి ఆశ్చర్య పోయారు . అక్కడకి వచ్చిన SI అంతా విని వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాడు. సరే నాతో రండి నేను ఇచ్చాపురం వరకు డ్రాప్ చేస్తా అని చెప్పి కార్ ఎక్కించుకుంటాడు. సైకిల్ కార్ మీద కట్టేస్తారు.మే 14th ఉదయానికి ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ ఇచ్చాపురం దగ్గర వాళ్ళని విడిచిపెట్టి SI జ్యోతి కి డబ్బులు ఇచ్చి సెల్యూట్ చేస్తాడు. అది చూసి జ్యోతి తండ్రి కంట్లో నీళ్లు తిరుగుతాయి, ఆడపిల్లకు చదువెందుకు అన్న తనకు చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది.
5వ రోజు ప్రయాణం పూర్తయ్యే సరికి బరంపురం గంజాం జిల్లా దాటి ఛత్రపూర్ లో ఎంటర్ అవుతారు. నైట్ రైల్వే స్టేషన్ లో విశ్రాంతి తీసుకుని హిజ్రాలు భోజనం పెడితే తింటారు..
6 వ రోజు ప్రయాణం బలుగాన్ సిలకా లేక్ పక్క నుండి ప్రయాణం కొనసాగిస్తారు.అప్పటికే జ్యోతి చాలా అనారోగ్యానికి గురై ఉంటుంది, వాళ్ళ నాన్న కాళ్ళ కి గాయం వల్ల సైకిల్ తొక్కలేడు. అప్పటికే దాదాపుగా 1000 km ప్రయాణం చేసారు.ఇది నిజంగా అద్భుతం ఒక అమ్మాయి పట్టుదల, అమ్మ మీద ఒక కూతురికి ఉన్న ప్రేమ. ఒక అద్భుతం పూర్తవడానికి ఇంకో 200 km దూరం అంతే. చరిత్ర చదవని ఇంకో విజయానికి అతి కొద్ది దూరంలో జ్యోతి ఉంది.6 వ రోజు గడిచేసరికి భువనేశ్వర్ సమీపంలో ఉన్నారు. 6 వ రోజు రాత్రి జ్యోతి వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది. అమ్మ కి జ్వరం ఎక్కువైపోయింది అని హాస్పిటల్ లో చేర్చారు అని చెబుతాడు.మేము వచేస్తున్నాం దగ్గర్లో ఉన్నా. జాగ్రత్తగా ఉండండి అని జ్యోతి తమ్ముడికి దైర్యం చెబుతుంది . కానీ జ్యోతి కూడా అమ్మ ఏమౌతుందో అని బయపడుతుంది.ఇంతలో జ్యోతికి పీరియడ్స్ వస్తాయి పాడ్ కొనటానికి కూడా డబ్బులు ఉండవు, రేపు ఎలా అయినా అమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలి ఏం చేయాలో తెలియక తండ్రి కి చెప్పలేక తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తుంది. అలా ఏడుస్తు తెలియకుండానే నిద్రలోకి జారుకుటుంది.మే 16th ఉదయం 3 గంటలు సమయంలో అమ్మాయి వచ్చి, జ్యోతిని నిద్ర లేపుతుంది. జ్యోతి లేచి ఎవరూ అని అడుగుతుంది. పక్కనే ఉన్న ఇళ్ళు చూపించి, ఈ ఇళ్ళు మాదే నీ పేరు జ్యోతి కదా? అని అడుగుతుంది. ఆ అమ్మాయి అవును నా పేరు జ్యోతి అని మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఈ వీడియో లో ఉన్నది నువ్వేనా అని ఒక వీడియో చూపిస్తుంది.ఆ వీడియో SI జ్యోతి కి సెల్యూట్ చేస్తున్న వీడియో అది జ్యోతి చేస్తున్న సాహస యాత్ర గురించి వివరిస్తూ ఉంటుంది.సైకిల్ గర్ల్ అనే పేరుతో నీ వీడియో చాలా వైరల్ అయ్యింది. నువ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయావ్ అని అ అమ్మాయి జ్యోతి కి చెబుతుంది . కానీ జ్యోతి ఆనంద పడే పరిస్థితిలో లేదు,అక్కా నాకు పీరియడ్స్ వచ్చాయి నాకు ఒక పాడ్ ఇస్తావా అని జ్యోతి ఆ అమ్మాయి ని అడుగుతుంది. ఆ అమ్మాయి వెంటనే పాడ్, కొన్ని ఫ్రూట్స్ ఉంటే జ్యోతి కి ఇస్తుంది.పళ్ళు తిని జ్యోతి ప్రయాణం మొదలుపెడుతుంది మే 16th… మధ్యాహ్నం 2pm అయ్యే సరికి భద్రక్ చేరుకుంటారు. అక్కడ నుండి బాలాసోర్ లోని తన గ్రామానికి ఇంకో 80km ఉంటుంది.ఇంతలో కొంత మంది బైక్స్ మీద, స్కూటీల మీద వచ్చి జ్యోతి కి సపోర్ట్ చేస్తారు. జ్యోతి వీడియో వైరల్ కావడం వలన చాలా మంది జ్యోతి ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫాలో అవుతారు. కొంత దూరం వరకు డ్రాప్ చేస్తారు. కొంత డబ్బులు, తినడానికి తిండి ఇస్తారు. చివరిగా మే 16th రాత్రి 9 గంటలు సమయంలో జ్యోతి వాళ్ళ గ్రామం చేరుకుంటుంది.గ్రామ పెద్దలు జ్యోతి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు .1200 km సాహస యాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించి కొంత డబ్బు ఇస్తారు . ఆ డబ్బును జ్యోతి అమ్మ చికిత్స కోసం ఉపయోగిస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనా నుండి కోలుకునేలా చేస్తుంది. జ్యోతి గురించి దేశం మొత్తం తెలుస్తుంది ,అన్ని న్యూస్ పేపర్స్ లో వస్తుంది ,ఇవంకా ట్రంప్ అభినందిస్తూ ట్వీట్ చేస్తుంది. ఇది చూసిన అల్ ఇండియా సైక్లింగ్ పెడరేషన్ వాళ్ళు వచ్చి జ్యోతికి ఫ్రీగా శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ పంపిస్తామని, అలాగే జ్యోతితో పాటుగా తన నలుగురు తమ్మల్లును ఫ్రీగా చదివిస్తామని చెబుతారు.జ్యోతి కి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2021 గా ఎంపిక అవుతుంది.
జ్యోతి నాన్న మోహన్ జ్యోతిని గర్వంగా తన భుజాలు మీద ఎత్తుకుని ఊరంతా తిప్పుతాడు..ఇలా నాన్న భుజాలు మీద ఎక్కడానికి 1200km ప్రయాణం చేయాల్సి వచ్చింది జ్యోతి కి.
ఒక అమ్మాయి తలుచుకుంటే ఎవరెస్ట్ ఎక్కగలదు, IAS అవ్వగలదు, ఫైలట్ అవ్వగలదు, దేశాప్రధాని కూడా అవ్వగలదు, తన కుటుంబం కోసం ఏమైనా చేయగలదు.. జ్యోతి కుమారి జీవితం మనందరికి స్ఫూర్తిదాయకం . ఇది ఒక యదార్థ కథ హర్యానా నుండి బీహార్ దర్బంగా వరకు 1200 km ప్రయాణం చేసిన జ్యోతి అనే అమ్మాయి కథ. ప్రస్తుత కథ కి అనుగుణంగా హైదరాబాద్ నుండి ఒడిస్సా గా మార్చబడింది.
*********
Nice story sir
Super👏👏👏