నాహం కర్తా హరిః కర్తా సర్వ సంభవామ్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచయిత: శ్రీ PVRK ప్రసాద్ గారు
సమీక్షకులు: మాధవి బైటారు” దేవి తనయ”
IAS ఆఫీసర్ గా వివిధ విభాగాలలో పనిచేసి టిటిడి లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, తిరుమల మరియు తిరుపతి లో విశేషమైన అభివృద్ధి పనులు చేపట్టిన శ్రీ PVRK ప్రసాద్ గారు, తాను టిటిడి లో చేరడానికి ప్రేరేపించిన సంఘటనలు నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా, వారి అమ్మాయి పెళ్ళి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దయతో ఎలా జరిగిందో అనే వివిధ సంఘటనలను ఆద్యంతం ఆసక్తికరంగా, అద్భుతంగా రచించారు. స్వాతి వారపత్రికలో ప్రచురింపడిన వారి స్వానుభవాల రచనల సమాహారమే ఈ పుస్తకం. 1979లో తిరుమలలో ఏర్పడిన భయంకరమైన నీటికొరత నివారణకు వరుణ జపం చేయడం వలన కుంభవృష్టి వర్షం తో రిజర్వాయర్స్ నిండడం, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారిని టిటిడి ఆస్థాన విద్వాంసులుగా నియమించడానికి ప్రేరేపించిన అంశాలు. 75 అడుగుల కొత్త ధ్వజస్థంభం ను కర్ణాటక అడవుల నుండి తెచ్చి, తిరుమల ఏడుకొండల పైకి ఎలా ఎక్కించారు? పాత స్థంభం స్థానంలో ఎలా అమర్చారు? ఇరుకిరుకు సందులతో ఉన్న తిరుమల మాడ వీధులను విస్తరించడానికి ప్రయత్నిస్తే స్థానికుల నుండి ఎదురైన ఆందోళనలు.
ఏడుకొండలు మెట్లు ఎక్కి వెళుతున్నప్పుడు కనిపించే భారి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన కి దారి తీసిన పరిస్థితులు. శ్రీవారి నామాన్ని రెండుసార్లు తగ్గించడానికి ప్రయత్నిస్తే గొడవలు ఎందుకు జరిగాయి? MS సుబ్బలక్ష్మిగారి గాత్రంలో అన్నమాచార్య కీర్తనలు, బాలాజి పంచరత్న మాల కాసెట్టులు, ఎల్ పి లు ఎలా పాడించారు? దాస సాహిత్య ప్రాజెక్టు ఆవిర్భావం. ప్రత్యేక కల్యాణోత్సవం ఆర్జిత సేవ, ఇత్యాది ఆసక్తికర 30 అంశాలతో, సరళమైన పదాలతో ఆసాంతం చదివేలా శ్రీ ప్రసాద్ గారు పుస్తకాన్ని తీర్చిదిద్దారు.
ఒక్కో అంశం ఎన్నిసార్లు చదివినా ఆనందంతో, తన్మయత్వంతో కళ్ళు చెమరుస్తునే ఉంటాయి.
ప్రతీ ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా శ్రీ వేంకటేశుని భక్తులు.