మట్టిలో మాణిక్యం
రచన: పిల్లి.హజరత్తయ్య
సంవత్సరాలు గడిచిపోయినా
తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా
కాలం భూతఃకాలంలో కలిసి పోయినా
ప్రజల మనోఫలకాలపై చెరగని
మహనీయుని రూపం సిద్ధప్ప వరకవి
శాలివాహన వంశం సమహితుడు
రాజయ్య లక్ష్మమ్మ తనయుడు
సమస్త కులాల విరాట్ స్వరూపుడు
మానవత్వాన్ని బోధించిన ఘనుడు
మరణం తర్వాత బ్రతికున్న తాత్వికుడు సిద్ధప్ప వరకవి
సంఘ సంస్కరణాభిలాష ఊపిరిగా
ధిక్కారమే ప్రాణంగా
ప్రజాసౌఖ్యమే పరమావధిగా
శృత పాండిత్యమే ప్రతిభగా రాణించిన
కాలజ్ఞాని సిద్ధప్ప వరకవి
మానవ స్వభావ సిద్ధమైన ప్రశాంతతకై
అర్ధరహిత ఆంక్షలను త్రెంచుటకై
ప్రజల్లో వెలుతురు నింపడానికై
అనుభవజ్ఞానమే చోదకశక్తిగా
ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ప్రజాకవి
వరకవులలో కవి యోగవంద్యులై
మూఢ భక్తిని నిరసించి
జ్ఞానమార్గానికి కొత్తదారులు చూపినాడు
జ్ఞానబోధిని, గోవ్యాఘ్ర సంభాషణలు వంటి
రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్దప్ప వరకవి
సాంప్రదాయక భావాలను బద్దలుకొట్టి
భావజాల పరమైన సమతను సాధించి
శ్రామికవర్గ కళ్యాణాన్ని కాంక్షించి
పామర రంజకమైన కవిత్వాన్ని రాసిన
మట్టిలో మాణిక్యం సిద్ధప్ప వరకవి
***